Telangana Municipal Elections 2026: కేటీఆర్ తీరుతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నష్టం.. సీఎం కూడా లైట్ తీసుకున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
Telangana Municipal Polls 2026 | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వాడే భాషను, ఆయన ప్రవర్తనను తప్పుపట్టారు.

Telangana Politics | హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అయిందని, అందుకు అసహనంతో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏముందని ప్రశ్నిస్తూనే, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో సిరిసిల్లలో సైతం కేటీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసినట్లే అని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తీరు వల్లే కేసీఆర్ రాజకీయంగా నష్టపోయారని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ను వెనక్కి లాగింది కేటీఆరేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తండ్రి సంపాదించిన అధికారం, ధనంతో కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బజారు రౌడీల కంటే హీనంగా కేటీఆర్ భాష ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రి పేరుతో బతికే వ్యక్తికి అహంకారం పనికిరాదు..
ఫోన్ ట్యాపింగ్లు, ఇతర అక్రమ పనులకు పాల్పడుతూ ఇంకా తానేదో పెద్ద నాయకుడినని కేటీఆర్ భ్రమ పడుతున్నారని దయాకర్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని, ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని, తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను గానీ, కేటీఆర్ను గానీ అసలు పట్టించుకోవడం లేదని, కేటీఆర్ తన పార్టీని తనే అంతం చేసుకుంటున్నారని విమర్శించారు. తండ్రి పేరు చెప్పుకుని బతికే వ్యక్తికి ఇంత అహంకారం పనికిరాదని, చేసేవన్నీ సిగ్గుమాలిన పనులు చేస్తూ ఇంకా నీతులు చెప్పడం హాస్యాస్పదమని అద్దంకి దయాకర్ దుయ్యబట్టారు.
సిరిసిల్లలో కేటీఆర్కు ఎండ్ కార్డ్ పడుతుంది.. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించబోతున్నారని, తన సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతుండటంతోనే కేటీఆర్ అసహనంతో సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారని బల్మూర్ వెంకట్ విమర్శించారు. కేటీఆర్ రాజకీయ జీవితం క్లైమాక్స్కు చేరుకుందని, సిరిసిల్లలో ఆయనకు ప్రజలు ఎండ్ కార్డ్ వేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. అమెరికాలో అంట్లు కడుక్కునే వ్యక్తిని తీసుకొచ్చి కేసీఆర్ ఇక్కడ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి లాంటి వారిని తొక్కేసి కేటీఆర్ పదవులు పొందారని ఆరోపించారు. గత పదేళ్లలో అధికార బలంతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, పాస్పోర్ట్ బ్రోకర్లు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఘాటుగా విమర్శించారు.
ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్లను గద్దె దించి సీఎం రేవంత్ రెడ్డి పవరేంటో నిరూపించారని బల్మూర్ వెంకట్ అన్నారు. సొంత చెల్లెలు (కవిత) అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్, సిగ్గు లేకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తన భాష మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
























