KTR Luxettipet Rythu Sadasu: మాది పోరంబోకు జాతి కాదు.. వలసపాలకుల సంక నాకే దగుల్బాజీ జాతి అసలే కాదు - రేవంత్కు కేటీఆర్ మాస్ కౌంటర్
KTR Mancherial Speech: గోదావరి నీళ్లు ఏపీకి తరలిపోతుంటే, పట్టిసీమ నడుస్తుంటే ఇక్కడ పట్టించుకోరా అని రేవంత్పై కేటీఆర్ మండిపడ్డారు. లక్సెట్టిపేట రైతు సదస్సులో ఆయన ప్రసంగించారు.

BRS Rythu Sangrama Sadasu: తెలంగాణ రైతులు నీళ్లు అడిగితే.. పొలాల్లో బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని సీఎంరేవంత్ మాట్లాడుతున్నారని "రక్తం చల్లుమంటావా నా కొడుకా... తీసుకో, కానీ రైతులకు నీళ్లు ఇవ్వు!" అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్సెట్టిపేట రైతు సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. గోదావరి నీళ్లు ఏపీకి తరలిపోతుంటే, పట్టిసీమ నడుస్తుంటే ఇక్కడ పట్టించుకోరా? మాట మాట్లాడితే 'ఏ జాతి నీది' అని అడుగుతారా? మాది పోరంబోకు జాతి కాదు.. వలసపాలకుల సంక నాకే దగుల్బాజీ జాతి అసలే కాదు అని గట్టికౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. యువత , రైతాంగం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 31 నెలల పాలనలోనే కాంగ్రెస్ మార్క్ ఫ్లాప్ సినిమా గా తేలిపోయిందని, మిగిలిన 29 నెలల్లో ప్రజలే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టి, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రైతు ప్రభుత్వాన్ని పునరుద్ధరించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తలను, ప్రజలను వేధించే అధికారులను, పోలీసులను అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.
ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పైకి తుపాకీ ఎక్కుపెట్టిన పోరంబోకు జాతి మాదికాదు..
— BRS Party (@BRSparty) July 21, 2026
వలస పాలకుల సంక నాకుతూ.. సమైక్య వాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు రేవంత్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥 pic.twitter.com/RgU5FyZNHL
కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు వల్ల రాష్ట్రంలో రైతులు అల్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పంట కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపం వల్ల ఆవేదనతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ 8 గంటల పాటు ధర్నా చేసినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం కిరాతక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. యూరియా కొనుగోలుకు కూడా యాప్ల పేరిట నిబంధనలు పెట్టి రైతులను షాపుల ముందు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద రెండు పిల్లర్లు కుంగితే, కేవలం 400 కోట్లతో 36 నెలల్లో పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే రాజకీయ కక్షతో పనులు ఆపేశారని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద 94 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నా, పంపులు ఆన్ చేస్తే ఎల్లంపల్లికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను సమన్వయంతో నడిపిస్తే రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని, కన్నెపల్లి పంపులు ఆన్ చేయవద్దని NDSA ఎక్కడా చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.
వరసగా నాలుగు సార్లు రైతుబంధు నిధులను ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్దేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దిల్లీలో వేలాది మంది విద్యార్థులు, యువత తమ ఆకాంక్షల కోసం పార్లమెంట్ ముందు నిలబడి కేంద్రాన్ని గడగడలాడించిన దృశ్యాలను చూశామని, తెలంగాణలోనూ రేవంత్ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. యువత, రైతులు తిరగబడి కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నాయకులు బయట కూడా తిరగలేరని స్పష్టం చేశారు. ఉడుకు నెత్తురు ఉన్న తెలంగాణ యువత, ఆక్రోశంలో ఉన్న రైతాంగం కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీలను తన్ని తరిమే రోజులు త్వరలోనే వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రహిత పాలన, రైతు సంక్షేమం మళ్లీ సాకారమవ్వాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంచిర్యాల వేదికగా కేటీఆర్ పిలుపునిచ్చారు.
ట్రెండింగ్ వార్తలు






















