KCR Public Meeting: ఈ 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏడాది తరువాత మళ్లీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బాస్!
BRS president KCR | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల వేదికగా భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని తెలిసిందే.

హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్ర రాజకీయాలకు ఎప్పుడూ కేంద్రబిందువే. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు ఏడాది తరువాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో 4 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో చేరికల్ని సూచిస్తుంది. ప్రస్తుతం ప్రజలు రాష్ట్రంలో బీఆర్ఎస్ను మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారు’ అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రచారానికి ఇదే నాంది..
‘కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని మేం ప్రకటించగా కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రోజున కాళేశ్వరం సమీపంలోని ఒక ప్రాంతంలో సభను ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బహిరంగసభ హైలైట్ కావొద్దని, సభకు తగినంత మైలేజీ రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అదే సమయానికి సభను నిర్వహిస్తోంది. రేపు జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ సభ తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి మా ప్రచారానికి నాంది పలుకుతుందని’ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు.
#WATCH | Hyderabad: BRS leader Ravula Sridhar Reddy says, "Former CM and BRS president, KCR, will be addressing a massive public rally in Jagtial tomorrow, where a senior Congress leader and a leader with more than four decades of public life, Sri Jeevan Reddy, will be joining… pic.twitter.com/wQMUrrXiP5
— ANI (@ANI) April 19, 2026
జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డపై తన పట్టును మళ్లీ నిరూపించుకునేందుకు గులాబీ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పశ్చిమ ప్రాంతమైన జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సుదీర్ఘ కాలం పాటు తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఈ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ శ్రేణులకు నైతిక బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏడాది తరువాత కేసీఆర్ స్పీచ్.. ఎదురుచూస్తున్న ప్రజలు
గత ఏడాది నుంచి కొంత మౌనంగా ఉన్న కేసీఆర్ ఈ సభ వేదికగా కాంగ్రెస్ పాలనపై తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరైన తరువాత మీడియాతో మాట్లాడి తమ వెర్షన్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల గడువు ముగియడం, సగం టర్మ్ ముగిసింది కనుక కేసీఆర్ జగిత్యాల వేదికగా గర్జిస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి రావడానికి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తమ గ్రౌండ్ వర్క్ మొదలుపెడుతుందని చర్చ జరుగుతోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















