Jeevan Reddy meets KCR: అన్నా.. దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు - కేసీఆర్ వద్ద జీవన్ రెడ్డి భావోద్వేగం
BRS: కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కలిసి పని చేయడానికి దేవుడే పంపించాడని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Jeevan Reddy meets KCR in Farmhouse: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ మలుపు చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు.
జీవన్ రెడ్డి భావోద్వేగం
కేసీఆర్ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నా.. అందుకే దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పాత మిత్రుడితో కలిసి ప్రయాణించే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో 2014లోనే కేసీఆర్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
"అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.."
— Ashok Goud Dusari (@ASHOKDUSARI) April 10, 2026
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం
- ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు,… pic.twitter.com/aYm1zxKztO
ఆత్మీయ ఆలింగనం.. విందు భేటీ
జీవన్ రెడ్డి రాకతో ఎర్రవెల్లి ఫామ్హౌస్లో సందడి నెలకొంది. తన పాత మిత్రుడిని కేసీఆర్ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయనను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. అనంతరం ఇద్దరు నేతలు కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. జగిత్యాల రాజకీయాలతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత జీవన్ రెడ్డి బృందంతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు.
కాంగ్రెస్కు భారీ దెబ్బ
నిజానికి గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న జీవన్ రెడ్డి వంటి మేధావి పార్టీలోకి రావడం బీఆర్ఎస్కు కొండంత అండని ఆ పార్టీ వర్గాలుచెబుతున్నాయి.
తెలంగాణ పునర్నిర్మాణం కోసమే..
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కనుమరుగవుతున్నాయని, అభివృద్ధి కుంటుపడుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సుస్థిరంగా ఉండాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉన్న జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత పటిష్టం కానుంది. రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు























