KCR News: దాదాపు 5 గంటలపాటు కేసీఆర్ ను విచారించిన సిట్, స్టేట్మెంట్ రికార్డ్
Telangana ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 5 గంటలపాటు సిట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.

హైదరాబాద్: బంజారా హిల్స్లోని నందినగర్ నివాసంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై అధికారులు ఆయనను ప్రశ్నించి, స్టేట్మెంట్ తీసుకున్నారు.
మాజీ ఎస్ఐబీ అధికారులను రిటైర్మెంట్ అయినా సర్వీసు ఎందుకు కొనసాగించారు. వారి పదవీ విరమణ తరువాత కూడా టచ్లో ఉన్నారా, వారితో ఏ విషయాలు చర్చించారు.. ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఎవరి నుంచి మీకు అందేవి అని.. విచారణలో భాగంగా సిట్ అధికారులు కేసీఆర్ను పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
సిట్ అధికారులు తొలుత హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి నోటీసులు పంపగా, కేసీఆర్ దానికి బదులిస్తూ తన ప్రస్తుత నివాసం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి అని స్పష్టం చేశారు. ‘నేను గత కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. నందినగర్ కేవలం అడ్రస్ కోసం మాత్రమే. చట్ట ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని వారు ఎక్కడ నివసిస్తుంటే అక్కడే విచారించాలి’ అని కేసీఆర్ పోలీసులకు రాసిన 6 పేజీల లేఖలో పేర్కొన్నారు. అయితే, ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం నందినగర్ నివాసమే రికార్డుల్లో ఉందని, విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు తరలించడం కష్టమని చెబుతూ సిట్ అధికారులు ఎర్రవల్లికి రావడానికి నిరాకరించారు.
డబుల్ స్టాండర్డ్స్ అని ఆరోపణ
హరీష్ రావు వంటి నేతలకు వారి సొంత ఊరు సిద్దిపేటలో కాకుండా హైదరాబాద్లో నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తన విషయంలో సిట్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. చట్ట ప్రకారం తాను ఈ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయినా బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తానని ప్రకటించారు. ఆ మేరకు కేసీఆర్ ఆదివారం ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 11 గంటల సమయానికి హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటకు ప్రారంభమైన సిట్ విచారణ దదాపు 5 గంటలపాటు కొనసాగింది. ఆరుగురు అధికారులు కేసీఆర్ను పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
మరోవైపు, కేసీఆర్ విచారణను నిరసిస్తూ తెలంగాణ భవన్ గేటు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు లోపలికి వెళ్లకుండా పోలీసులు గేటుకు అడ్డంగా నిలబడి గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















