HCU Lands Issue: ఆ 400 ఎకరాల భూములపై హైకోర్టులో పిటిషన్, రేపు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ భూములపై వివాదం మొదలైంది. యూనివర్సిటీ భూములు అని నిరసన, ఆందోళన వ్యక్తమవుతోంది.

కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ 400 ఎకరాలు హెచ్సీయూ భూమి అని, అటవీ భూమిలో వన్య మృగాలకు ఆవాసం ఉండదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వట ఫౌండేషన్ 400 ఎకరాల వివాదాస్పద భూముల వ్యవహారంపై ప్రజా ప్రయోజన వాజ్యం (PIL on 400 Acre Land) దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనం (National Park)గా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. అత్యవసరంగా పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టాలని వట ఫౌండేషన్ లాయర్ కోరారు. రేపు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలోని ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదని, గవర్నమెంట్ భూములు అని అందుకు సంబంధించి డాక్యుమెంట్స్ ప్రభుత్వం విడుదల చేసింది. టీజీఐఐసీ సైతం ఆ 400 ఎకరాల భూములు ప్రభుత్వానివని క్లారిటీ ఇచ్చింది. గతంలో జరిగిన కేటాయింపులు కేసుల వివరాలు, ఇటీవల హైకోర్టు తీర్పుతో ఆ భూములు మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చినట్లు స్పష్టం చేసినా వివాదం కొనసాగుతోంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అది అటవీ భూమి అని, వన్యమృగాలను అక్కడి నుంచి తరిమి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటుందని విమర్శించారు.
ఆ భూమి అటవీ పరిధిలోనిది.. బండి సంజయ్ సంచలనం
కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిది అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా చెట్లు నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఉన్నట్లు తెలిపారు. కానీ కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే NGO దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఆ భూములను కోర్టు తీర్పులు తేలే వరకు వేలం వేయడం కుదరదు అన్నారు.
ఈ విషయం తెలిసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని బండి సంజయ్ అన్నారు. ‘చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు ఆర్జించాలనుకోవడం నిజంగా దుర్మార్గం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలు పట్టించుకోకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని’ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.






















