Jubilee Hills byelection: అక్టోబర్ 4 లేదా 5న జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ - తుది ఓటర్ల జాబితా విడుదల
Byelection: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక వచ్చే అక్టోబర్ నాలుగు లేదా ఐదు తేదీల్లో విడుదల కానుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈసీ ఉప ఎన్నికతేదీలను కూడా ప్రకటించనుంది.

Jubilee Hills byelection schedule on October 4th or 5th: జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జా బితాలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు, ఇందులో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు , 25 ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
ఎన్నికల కమిషన్ ప్రకారం, తుది ఓటర్ల జాబితాలో గత ఎన్నికల కన్నా 1.61 శాతం ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉన్న 3,98,982 ఓటర్లు మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు వినియోగిచుకుంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటుగా 980 ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లేదా వోటర్ హెల్ప్లైన్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాబితాలో పేర్లను చేర్చడానికి లేదా తీసివేయడానికి ఫిర్యాదులు దాఖలు చేయడానికి, ఫారం-6 (పేరు చేర్చడానికి), ఫారం-8 (పేరు, చిరునామా మొదలైనవి సరిచేయడానికి) ఉపయోగించవచ్చని ఈసీ తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ నాలుగు, ఐదు తేదీల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. బీహార్ కు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అదే సమయంలో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు. బీహార్ లోనూ మంగళవారమే పూర్తి స్థాయి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను పూర్తిగా సంస్కరించారు. దాదాపుగా అరవై లక్షలకుపైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరణించిన వారు, శాశ్వతంగా వలసపోయిన వారు అలాగే.. రెండు ఓట్లు ఉన్న వారు ఇలా అందర్నీ తొలగించారు ఈ ప్రయత్నంపై వివాదం ఏర్పడినప్పటికీ అంతా పారదర్శకంగా చేస్తున్నామని ఈసీ ప్రకటించింది. అందుకే బీహార్ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమోనని ఈసీ నాలుగు రోజుల సమయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీటు కావడంతో ఎలాగైనా సీటును నెలబెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతపేరును ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా విజయం కకోసం రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తమ పాలనపై వ్యతిరేకత రాలేదని నిరూపించుకునేందుకు గెలిచి తీరాల్సిన పరిస్థితిలో పడింది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో గెలిచారు. అందుకే జూబ్లిహిల్స్ లోనూ సానుభూతి పని చేయదని.. తమ పార్టీ పాలనను మెచ్చి తమకే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు.
ఈ నియోజకవర్గంలో మజ్లిస్ కు మంచి బలం ఉంది. ఆ పార్టీ పోటీ చేస్తే ఓ రకంగా పోరు ఉటుంది. పోటీ చేయకపోతే.. ఎవరికి మద్దతు ఇస్తుందన్నదానిపై ఫలితం ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.





















