HYDRA News: కొండాపూర్లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా
హైడ్రా హైదరాబాద్లో కబ్జాదారుల ఆట కట్టిస్తోంది. ఈ క్రమంలో కొండాపూర్ పరిధిలోని రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో అక్రమ కబ్జాకు గురైన భారీ విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) కాపాడింది. రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా అధికారులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడకు వెళ్లే మార్గంలో హైడ్రా కీలక ఆపరేషన్ నిర్వహించింది. సుమారు ఏడు వందల కోట్ల విలువైన ఈ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించి హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది.

స్థానిక జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఆ నీటి కుంటను మట్టితో పూడ్చి ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి సన్నద్ధమయ్యారు. ఈ అక్రమాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడంతో, వారు కబ్జాదారులపై కేసులు నమోదు చేశారు. ప్రజల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆ విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కుంట చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించారు. నగరంలోని ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించడం ద్వారా వర్షాకాలంలో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టింది.
ఇటీవల గండిపేట మండలం, నార్సింగ్ విలేజ్, ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలోని పార్కును కబ్జాల చెర నుంచి హైడ్రా కాపాడింది. నార్సింగ్ చౌరస్తాలో 3 వేల గజాల పార్కు భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఆ భూమి విలువ రూ. 60 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
హైడ్రా అంటే ఏంటి.. ఏ పనులు చేస్తుంది..
హైదరాబాద్ నగరంలోని ప్రకృతి వనరులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవస్థే హైడ్రా (HYDRAA - Hyderabad Disaster Response and Asset Protection Agency). జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాల నుండి విముక్తి చేయడం, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 'హైడ్రా'ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి మరిన్ని అదనపు అధికారాలను కల్పిస్తూ హైడ్రా ద్వారా కబ్జాదారుల పని పడుతోంది. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న చెరువుల ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి, భవిష్యత్తులో వరద ముప్పును తగ్గించాలని అనేది దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు, అత్యవసర సమయాల్లో విపత్తుల నుంచి నగర ప్రజలను కాపాడేందుకు హైడ్రాకు ప్రభుత్వం అధికారులు ఇచ్చింది.
హైడ్రా చేపట్టిన ఇతర కీలక ఆపరేషన్లు
గండిపేట, హిమాయత్ సాగర్: జంట జలాశయాల పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో నిర్మించిన విలాసవంతమైన ఫామ్హౌస్లను, అక్రమ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించి ప్రభుత్వ భూములను కాపాడారు.
అమీన్పూర్ చెరువు: అత్యంత వివాదాస్పదమైన అమీన్పూర్ చెరువు సమీపంలోని ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి విడిపించి, అక్కడ వెలిసిన భారీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
మాదాపూర్, శేరిలింగంపల్లి: ఐటీ కారిడార్లోని విలువైన చెరువు శిఖం భూముల్లో నిర్మించిన అపార్ట్మెంట్ గోడలు, షెడ్లను తొలగించి కుంటలను సైతం హైడ్రా పునరుద్ధరించింది.























