Hyderabad Terror Attack Plan: హైదరాబాద్లో మరో ఉగ్రదాడికి కుట్ర! చంచల్గూడ జైలు ములాఖత్లే వేదికగా స్కెచ్?
Hyderabad Terror Attack: నగరంలోని చంచల్గూడ జైలు ములాఖత్లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని, లష్కరే తోయిబా ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రకుట్రకు చంచల్గూడ జైలు ప్రధాన కేంద్రంగా మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జైలులో ఉన్న ఖైదీలను కలిసేందుకు వచ్చే 'ములాఖత్' సమయంలోనే ఉగ్రదాడులకు సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో ఇదివరకే పలుమార్లు ఉగ్రదాడులు జరిగాయి. కోఠి గోకుల్ చాట్, లుంబిని పార్క్, మక్కా మసీదు, దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద పలు సందర్భాలలో జరిగిన పేలుళ్లలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
చంచల్గూడ జైలు నుంచే ప్లాన్!
చంచల్గూడ జైలులో ఉన్న ఉగ్రవాదులు, ములాఖత్కు వచ్చిన వ్యక్తులతో హైదరాబాద్ నగరంలో దాడులు చేయడమే లక్ష్యంగా సంభాషణలు జరిపినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మొత్తం కుట్ర వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కి చెందిన ఒక కీలక ఉగ్రవాది ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
టార్గెట్ ఏరియాలు: ఉగ్రవాదుల కదలికలు, పాత నేరస్తుల రికార్డులు పరిశీలించిన నిఘా అధికారులు నగరంలోని ముసారంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
నగరంలో పోలీసులు అలర్ట్..
చంచల్ గూడ జైలు ములాఖత్ సమయంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారంతో నగర పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైలులో ములాఖత్ కోసం వస్తున్న వ్యక్తుల వివరాలను, వారి గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు, సిసిటివి ఫుటేజీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగర వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
























