Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో మంగళవారం నాడు పలు చోట్ల భూమి కంపించింది. దాంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చి విద్యార్థులను పంపించివేశారు.

Earthquake Tremors Felt in Gajularamaram, Medchal | కుత్బుల్లాపూర్ : మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం, ఆదర్శనగర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా షేక్ అవ్వడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక, ప్రజలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఉన్న చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనల మధ్య తరగతి గదుల నుంచి బయటకు వచ్చారు. ఆ పరిధిలోని స్కూళ్లకు సెలవు ఇచ్చి, విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విద్యార్థులు భయంతో పాఠశాల మైదానంలోకి రావడం, స్థానికులు గుంపులుగా చేరి చర్చించుకోవడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అయితే, ఇది నిజంగా భూకంపమా లేక స్థానికంగా ఉన్న మరేదైనా ఇతర కారణాల వల్ల ఈ కంపనాలు వచ్చాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై భూభౌతిక శాస్త్రవేత్తలు (NGRI నిపుణులు), అధికారులు స్పందించాల్సి ఉంది.
























