Telangana Caste Census: తెలంగాణలో క్రైస్తవులు లేరా? రీ సర్వేలో అయినా వివరాలు చెప్తారా?
Telangana Caste Census News: తెలంగాణలో ముస్లిం మైనార్టీ వివరాలు ప్రకటించిన ప్రభుత్వం క్రిస్టియన్ల లెక్క మాత్రం చెప్పలేదు. మరి క్రైస్తవులను బీసీలో కలిపారా, ఓసీలో కలిపారా అనేది తెలియడం లేదు.

Telangana Caste Census: కుల గణనలో పాల్గొనని వారికి తిరిగి అవకాశం ఇస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రీ సర్వే ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది. తొలి విడత సర్వేలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ కులాలకు సంబంధించిన వివరాలు కొంత బయపెట్టింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బీసీ, ఎస్సీ జనాభా తగ్గించి చూపించారని, ఓసీ జనాభా పెరిగిందని ఇదంతా కుట్రపూరితంగా జరిగిందన్న విమర్శలు కాంగ్రెస్ పాలకులపై వచ్చాయి. అయితే దీన్ని సవరించేందుకు తిరిగి తెలంగాణ సర్కార్ రీసర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే మైనార్టీల విషయానికి వస్తే తెలంగాణలో ముస్లిం మైనార్టీ వివరాలు ప్రకటించిన ప్రభుత్వం క్రిస్టియన్లు ఎంత మంది ఉన్నారన్న లెక్క మాత్రం చెప్పలేదు.
క్రైస్తవులను బీసీలో కలిపారా, ఓసీలో కలిపారా...?
క్రైస్తవులను ఓసీల్లో కలిపారా లేదా బీసీల్లో ఉంచారా అనే ప్రశ్నలు క్రైస్తవ సమాజం నుంచి వస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1.27 శాతం క్రైస్తవులు తెలంగాణలో ఉన్నారు. అన్ని కులాల వాళ్లు క్రైస్తవంలోకి మారారు. వీరిలో ఎక్కువ శాతం దళిత వర్గాలే. చట్ట ప్రకారం ఏ కులం వారు ఆ మతంలోకి మారినా కులం మాత్రం మారదు. ఉదాహరణకు ఓసీ క్రైస్తవుడు అయితే అతడు ఓసీగానే పరిగణిస్తారు. బీసీ కులం వ్యక్తి అయితే బీసీగానే గుర్తిస్తారు. ఎస్టీలకు ఇదే వర్తిస్తుంది.
Also Read: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
దళితులు మారితే 1952 కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఎస్సీగా గుర్తించే అవకాశం లేదు. వాళ్లు బీసీ- సీ క్యాటగిరీ కిందకు వస్తారు. వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ సర్వేలో క్రైస్తవుల సంఖ్య కాని, ఎంత శాతం ఉన్నారన్న వివరాలు మాత్రం ప్రభుత్వం ప్రకటించ లేదు. దీంతో క్రైస్తవ సమాజంలో కొంత ఆందోళన నెలకొంది.
రీ సర్వేలో ఆ వివరాలు బయట పెడతారా...?
హిందువుల్లోని కులాల జనాభా సంఖ్య, శాతం, ముస్లిం మైనార్టీల జనాభా, వారి శాతం తెలిపి కేవలం ఎందుకు క్రైస్తవ జనాభా సంఖ్య, జనాభా శాతం వివరాలు దాచడం ఏంటన్న ప్రశ్నను తలెత్తుతోంది. క్రైస్తవ సమాజం మాత్రమే కాకుండా బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వంటి వారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రీ సర్వే తర్వాతైనా తెలంగాణలో క్రైస్తవ జనాభా ఎంత ఉంది అన్న విషయాన్ని బయటకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దళితుల నుంచి క్రైస్తవ మతంలో చేరిన బీసీలు ఎంత మంది అన్న వివరాలు తెలిపాలని కోరుతున్నారు.
Also Read: బీఆర్ఎస్ పింక్ బుక్ రెడీ - ఎంట్రీలు షురూ - అన్నీ తిరిగిచ్చేస్తామని కవిత హెచ్చరిక
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

