Kavitha Latest News: బీఆర్ఎస్ సంక్షోభం: కవిత, నేతల మధ్య మాటల యుద్ధం..రహస్య ఆపరేషన్ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డేనా?
Kavitha: భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభం రావడానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల కవితను పావుగా వాడుకుని బీఆర్ఎస్లో చిచ్చుపెడుతున్నారని చెబుతున్నారు.

Kavitha Latest News: బీఆర్ఎస్ నేతలు, పార్టీని వీడిన కవిత వర్గం మధ్య ఇప్పుడు మాటల యుద్ధం సాగుతోంది. ఈ రెండు వర్గాలు ఈ అంతర్గత సంక్షోభానికి కారణం ఆ ఒక్కరేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఆ ఒక్కరు ఎవరో తెలుసా? బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం వెనుక ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, పార్టీని చీల్చడానికి హరీశ్ రావు-రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు పన్నుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుంటే, రేవంత్ వ్యూహంలో భాగంగానే కవిత వ్యవహరిస్తోందని గులాబీ నేతలు ప్రత్యారోపణ చేస్తున్నారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నా, ఇద్దరూ లక్ష్యం చేసుకుంది మాత్రం సీఎం రేవంత్ రెడ్డినే కావడం విశేషం.
కవితను నడిపిస్తుంది రేవంత్ రెడ్డి - బీఆర్ఎస్ ఆరోపణ
భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభం రావడానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల కవితను పావుగా వాడుకుని బీఆర్ఎస్లో చిచ్చుపెడుతున్నారని చెబుతున్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేసి మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రేవంత్ కనుసన్నల్లోనే నడుస్తూ కవిత పార్టీ ముఖ్య నేతలైన హరీశ్ రావు, సంతోష్లపై విమర్శలు చేశారని ఆ పార్టీ నేతలు నిరంజన్ రెడ్డి, పళ్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వంటి కీలక నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీని అంతర్గతంగా బలహీనపరిచి, కాంగ్రెస్ బలపడేలా వ్యూహం పన్నారని, అందులో భాగమే కవిత చేస్తున్న ఆరోపణలని చెబుతున్నారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పన్నాగంలో భాగమేనని గులాబీ నేతలు చెబుతున్నారు. కవిత తన రాజకీయ జీవితాన్ని పటిష్టం చేసుకోవడానికి రేవంత్ సాయం చేస్తున్నారని, ఇది ఓ రహస్య రాజకీయ ఆపరేషన్గా బీఆర్ఎస్ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్లో కీలక నేత అయిన హరీశ్ రావును టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడటం వెనుక ఉన్న రహస్య ఎజెండా ఇదేనని విశ్లేషిస్తున్నారు.
హరీశ్ రావు కుట్రలు రేవంత్ రెడ్డి డైరెక్షనే - కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కవిత వర్గం ఖండిస్తోంది. ఒకే ఫ్లైట్లో సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ప్రయాణం చేశారని, ఈ సందర్భంగానే హరీశ్ రావు రేవంత్ రెడ్డికి లొంగిపోయారని కల్వకుంట్ల కవిత నేరుగా ఆరోపణలు చేశారు. ఇది నిజమా కాదా తేల్చి చెప్పాలని అటు హరీశ్ రావును, ఇటు రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. పార్టీని చీల్చడంలో భాగంగానే తనపై కుట్రలు చేశారని కవిత చెప్పుకొచ్చారు. తన ప్రాబల్యం పెంచుకోవడానికే హరీశ్ రావు పార్టీలో ముఖ్యులైన వారిని టార్గెట్ చేస్తున్నారని, అందులో భాగంగానే కవితను పక్కకు తప్పించారని, రేపో మాపో కేటీఆర్, కేసీఆర్లకు కూడా ఈ కుట్రల సెగ తగులుతుందని కవిత వర్గం ఆరోపిస్తోంది. 2018లో హరీశ్ రావు కొద్దిమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీకి తెలియకుండా నిధులు సమకూర్చారని, ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. వై.ఎస్. హయాంలో కూడా పార్టీకి తెలియకుండా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని కలిసి వచ్చారని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న రహస్య ఒప్పందం వల్లే పార్టీలో ఈ సంక్షోభం నెలకొందని కవిత వర్గం ఆరోపిస్తోంది.
కాళేశ్వరం అవినీతి సొమ్ము కోసమే కుమ్ములాటలు - CM రేవంత్ రెడ్డి
అయితే బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం వెనుక తన పేరు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వారి వెనుక తాను ఉన్నానని చౌకబారు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు అలాంటి అవసరం లేదని అన్న రేవంత్, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ద్వారా వచ్చిన సొమ్ముల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులకు దిగుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.
అయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు బాధ్యులు మీరంటే మీరని అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు కవిత వర్గం ఆరోపణలు చేసుకుంటున్నా, సీఎం రేవంత్ రెడ్డి పేరు మధ్యలో రావడం ఒక కొత్త కోణంగా చెప్పవచ్చు.






















