Vandemataram 150 Years: వందేమాతరానికి "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక
కోట్లాది భారతీయుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన గీతం... 'వందేమాతరం' 150 ఏళ్ల చరిత్ర. ఉన్న ఆ భావోద్వేగాన్ని నేటితరానికి పరిచయం చేయడం కోసం సాంస్కృతిక యాత్ర చేస్తోంది 15 ఏళ్ళ అక్షర దేవళ్ల.. !

Akshara Devalla vandematharam: 15 ఏళ్ల వయసులో చాలామంది సోషల్ మీడియా ట్రెండ్స్ను వెంబడిస్తుంటే... అక్షర మాత్రం "వందేమాతరం"ను ట్రెండ్గా కాదు... ఉద్యమంగా మార్చాలని నిర్ణయించుకుంది. అందుకే 'వందేమాతరం @150 పేరుతో దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక యాత్ర మొదలుపెట్టింది. చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి అందులో ఎంతో రికార్డులు సృష్టించిన అక్షర.. వందేమాతర స్ఫూర్తిని జనంలోకి తీసుకెళ్లడానికి తన 'కళ'నే ఎంచుకుంది.
కర్గిల్ కొండల్లో.. పహల్గామ్ గుండెల్లో... వందేమాతర నర్తనం
ఆమెకు నాట్యం అంటే కేవలం కళ కాదు... అది భావాన్ని చెప్పే భాష. అందుకే ప్రతి ప్రదర్శనలో దేశభక్తిని నృత్య రూపంలో ఆవిష్కరిస్తోంది. వందేమాతరం పురుడుపోసుకుని 150 ఏళ్లు అయిన సందర్భంగా ఆ గీతం పూర్తి వెర్షన్ను కేంద్రప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. తన నాట్యం ద్వారా దానిని జనంలోకి తీసుకెళ్లేందుకు అక్షర ఓ ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకుంది. కర్గిల్ మంచుకొండల్లో చెప్పులు లేకుండా "వందేమాతరం"కు నాట్యం చేసింది. పుల్వామాలో అమర జవాన్లకు నివాళిగా అదే గీతాన్ని ప్రదర్శించింది. ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు తగ్గిన పహల్గామ్లో "భయాన్ని కాదు... భారతాన్ని నమ్మండి" అనే సందేశంతో నృత్యం చేసింది. ఆ గీతం పుట్టుక వెనుక చరిత్ర తెలుసుకునేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లి బంకించంద్ర చటర్జీ నివాసం, రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబ గృహం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసాన్ని సందర్శించింది.

15 ఏళ్ల అక్షర కల.. 150మంది ప్రత్యేక చిన్నారుల చిరునవ్వై..
యువతకు వందేమాతరం చరిత్రను పరిచయం చేయడం కోసం ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే… “ఈ పూర్తి వందేమాతరం పాటను ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఎలా చేరవేయాలి?” అనే ప్రశ్నే ఓ మహత్తర కార్యక్రమానికి పునాది అయింది. "వాళ్లకి జాలి అవసరం లేదు.. అవకాశం చాలు.." అని నమ్మిన అక్షర.. ఆ అవకాశం కల్పించడం కోసం... ముందుగా వారికి ఆ గీతానికి అభినయం నేర్పించింది. హైదరాబాద్లోని దేవనార్ ఫౌండేషన్, PHIN, సుమన్ ఆటిజం స్కూల్లలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కూచిపూడి నేర్పిస్తోంది. "వందేమాతరం"ను పాటగా మాత్రమే కాకుండా... ఆత్మవిశ్వాసంగా వారి జీవితాల్లో నింపుతోంది. కేవలం స్కూల్స్ కు వెళ్లి దివ్యాంగ విద్యార్థులకు వందేమాతరం డ్యాన్స్ నేర్పించడంతో అక్షర ఆగిపోలేదు. వారి ప్రదర్శనకు గుర్తింపు రావాలన్న లక్ష్యంతో, వారికి ఓ పెద్ద వేదికపై ప్రదర్శన చేసే అవకాశం కల్పించడం కోసం రవీంద్ర భారతి వేదికగా "వందేమాతరం 150 - యాన్ ఇన్ క్లూజివ్ డ్యాన్స్ ట్రిబ్యూట్ టు ద నేషన్ బై అక్షర దేవళ్ల" పేరుతో తన సొంత ఖర్చులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

రవీంద్రభారతిలో భావోద్వేగం
అక్షర ఆలోచన- రవీంద్రభారతి వేదికపైకి వందలాది మంది దివ్యాంగ విద్యార్థులను నడిపించింది. చూపులేని పిల్లలు…వినలేని పిల్లలు… మాట్లాడలేని పిల్లలు… ఆటిజం, మేధో వైకల్యం ఉన్న చిన్నారులు… వీళ్లందరినీ ఒకే వేదికపై నిలబెట్టి, భారత జాతీయ గేయం వందేమాతరం పూర్తి ఆరు చరణాలకు భారతీయ శాస్త్రీయ నృత్య రూపంలో ప్రదర్శన చేయించడమనే అసాధ్యాన్ని అక్షర సాధ్యం చేసింది. ఒకరూ ఇద్దరు కాదు 150 మంది బ్లైండ్, డెఫ్, ఆటిజం పిల్లలతో వందేమాతరం నృత్యాన్ని రవీంద్ర భారతి వేదికపై ప్రదర్శన ఇప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. బేగంపేట లేని దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ , మలక్ పేట లోని ఫిన్ డెఫ్ స్కూల్, కవాడిగూడ లోని సుమన్ ఆటిజం సెంటర్, ఆదిలాబాద్ కు చెందిన విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటలెక్చువల్ చిల్డ్రన్ పిల్లలు ఈ అరుదైన ప్రదర్శనలో నృత్యం చేశారు.

అక్షర ఎంచుకున్న విద్యార్థులు మూడు రకాల వైకల్యాలకు సంబంధించిన వారు. వీళ్లది ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. అంధ విద్యార్థులను ఏమీ కనిపించదు.. ప్రతీ ఒక్కరికీ పాట అర్థం చెప్పి.. దానికి అభినయించడం ఎలాగో కేవలం టచ్ ద్వారా మాత్రమే చెప్పగలగాలి. అక్షర ఓపికగా ప్రతీ ఒక్కరికీ టచ్ ద్వారా వారికి ఈ నృత్యాన్ని నేర్పించింది. ఇక వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి కనిపిస్తుంది కానీ, వినిపించదు. పాట ఎలా వస్తుందో తెలియదు. కానీ మనకు వినిపించే పాటకు తగ్గట్లుగా వాళ్లకు నృత్యం నేర్పించడం సవాల్ గా తీసుకుని వాళ్లచేత అడుగులు వేయించింది. ఇక ఆటిజం పిల్లలు ఒక్క చోట నించోలేరు. వారిని క్షణం కూడా కంట్రోల్ చేయలేరు. అసలు కుదురుగా లేని వారికి డాన్స్ నేర్పించాలన్న ఆలోచనే పెద్ద చాలెంజ్. దానిని చాలా సవాల్గా తీసుకుని వారికి కొద్దికొద్దిగా పాటను నేర్పించింది అక్షర..! వీళ్లకు నృత్యాన్ని నేర్పించే క్రమం తనకో అద్భుత అనుభవం అని అక్షర చెబుతోంది. " ఈ మూడు రకాల లోపాలున్న విద్యార్థులను చూసినప్పుడు, వారికి శిక్షణ ఇస్తున్నప్పుడు వారు ఎంత టాలెంటెడో నాకు తెలిసింది. లోపం కేవలం శరీరానికే గానీ, తెలివికి కాదని, సాధారణ విద్యార్థులకన్నా వీళ్లు ఇంకా తెలివైన వారని అర్థమైంది. వారికి చెప్పగలిగేలా ఓపికతో చెబితే ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు" కేవలం వందేమాతరం పాటను నేర్పించడంతో తన ప్రయాణం ఆగిపోలేదని, ఈ పిల్లలకు తాను నృత్య శిక్షణను కొనసాగిస్తానని అక్షర చెబుతోంది.

రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వందేమాతరం 150 ఇన్ క్లూజివ్ డ్యాన్ ట్రిబ్యూట్ కార్యక్రమానికి సీఎస్ బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ ఫౌండర్ పద్మశ్రీ డా.సాయిబాబా గౌడ్, ఫిన్ డెఫ్ స్కూల్ ప్రెసిడెంట్ వి.జానకి, మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఫౌండర్ సుమన్ షరాఫ్, భారత బీడీసీఏ క్రికెట్ జట్టు కెప్టెన్ ధీరావత్ మహేశ్ నాయక్ హాజరై ఈ అద్భుత నృత్య ప్రదర్శన చేయించిన అక్షర దేవళ్లను, నృత్యాన్ని చేసిన విద్యార్థులను అభినందించారు.
వందేమాతరం 150 వేడుకలు దేశవ్యాప్తంగా ఎన్నో జరిగాయి.. కానీ, ఇలా దివ్యాంగ విద్యార్థులతో వందేమాతరం నృత్యం చేయించడం మాత్రం ఇదే మొదటి సారి. వందేమాతరానికి ఎంతో అద్భుతంగా ఈ పిల్లలకు నృత్యం నేర్పించిన అక్షరను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంత చిన్న వయస్సులో ఇంత సాహసాన్ని చేసినందుకు అభినందనలు" అంటూ బాలాలత అక్షరను ప్రశసించారు.

150 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిగా నిలిచిన ఆ గీతం... నేడు ఓ పదిహేనేళ్ల బాలిక అడుగుల్లో మరోసారి ప్రాణం పోసుకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు






















