CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Revanth Reddy Challenges KCR Modi: మియాపూర్లో జరిగిన ప్రజా పాలన సభలో సీఎం రేవంత్ప్ర తిపక్షాలపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు రాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఆరోపించారు.

Kishan Reddy Stopping Telangana Funds Revanth: మియాపూర్లో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' బహిరంగ సభ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పదునైన విమర్శలు, సవాల్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు
హైదరాబాద్ మహా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్ అవసరాల కోసమే నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను ఉదహరిస్తూ.. హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు రాకుండా ఒక పద్ధతి ప్రకారం మెట్రో రెండో దశ విస్తరణ, గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టబోతున్నామని ప్రకటించారు. జెండాలు, ఎజెండాలకు అతీతంగా నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
కిషన్ రెడ్డికి రాజకీయాలే ఎక్కువయ్యాయి!
అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేవెళ్ల, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. "కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రధాని మోదీని తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఎందుకు అడగడం లేదు? రాష్ట్రానికి రావలసిన నిధులను రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా?" అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రధాని మోదీ గుజరాత్లోని సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అనే వీరు.. తాము మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళ్లలో కట్టెలు పెడుతున్నది కిషన్ రెడ్డే
బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య సాగుతున్న అంతర్గత బంధాన్ని ఎండగడుతూ ‘చీకటి ఒప్పందాల’పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము దిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే, దాన్ని చెడగొట్టడానికి కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. "నేను ప్రధానిని కలిస్తే ఈయన పోయి కలుస్తాడు.. నేను కేంద్ర మంత్రిని కలిస్తే ఈయన పోయి కలుస్తాడు. తెలంగాణకు నిధులు రాకుండా, ప్రగతి జరగకుండా నిరంతరం కాళ్లలో కట్టెలు పెడుతున్నారు" అంటూ మండిపడ్డారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల అవినీతి, అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తీరు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఇద్దరికీ తెలంగాణలో పుట్టగతులు లేకుండా ప్రజలు బుద్ధి చెబుతారని, మళ్లీ ఢిల్లీ మొహం చూడకుండా చేస్తారని హెచ్చరించారు.
పాలనపై చర్చకు సవాల్
రాష్ట్రంలో గత పదేళ్ల కేసీఆర్ పాలన, కేంద్రంలో పన్నెండేళ్ల మోదీ పరిపాలనతో పాటు కేవలం 30 నెలల తమ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరేం చేశారో, తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో తేల్చుకుందాం రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ హయాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్టాల్స్, పెట్రోల్ బంకుల యాజమాన్య హక్కులు కల్పించామని గుర్తుచేశారు. విద్యార్థుల కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని చెబుతూ.. చేతనైతే అభివృద్ధికి సూచనలు చేయాలి తప్ప అడ్డుపడవద్దని హితవు పలికారు.
LIVE: Hon’ble CM Sri A. Revanth Reddy participates in the inauguration of various development works in Cyberabad Municipal Corporation and Address the public at Miyapur Cross Roads https://t.co/xQxK4cMytj
— Telangana CMO (@TelanganaCMO) June 8, 2026
లక్ష ఇళ్ల నిర్మాణం
మహానగరంలో ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి విడిపించి, అక్కడ నిరుపేదల కోసం లక్ష ఎల్ఐజీ , ఎమ్ఐజీ ఇళ్లను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. గతంలో రాజీవ్ గృహకల్ప తరహాలోనే ఎక్కడికక్కడ పేదలకు సొంతింటి కలను నిజం చేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే 24 నెలల కాలం కేవలం అభివృద్ధి, సంక్షేమంపైనే తమ ప్రభుత్వం పూర్తి దృష్టి సారిస్తుందని, రాజకీయ పగప్రతీకారాలకు తావులేకుండా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















