![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sun Stroke Deaths: తెలంగాణలో భానుడి ఉగ్రరూపం - వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి
Telangana News: తెలంగాణలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. శనివారం ఒక్కరోజే ఎండదెబ్బకు 19 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
![Sun Stroke Deaths: తెలంగాణలో భానుడి ఉగ్రరూపం - వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి 19 people died due to sun stroke in telangana Sun Stroke Deaths: తెలంగాణలో భానుడి ఉగ్రరూపం - వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/05/f73e74723094263a5461a913f0aa4b261714886928286876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sun Stroke Deaths In Telangana: తెలంగాణలో (Telangana) భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత దాటి నమోదవుతుండగా.. దీంతో పాటే తీవ్రమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజులు వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటుందని.. కొన్నిచోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 45 - 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 169 మండలాల్లో వడగాలులు వీచినట్లు తెలిపారు. కాగా, ఎండలకు తాళలేక దినసరి కూలీలు, రైతులు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. శనివారం ఒక్కరోజే పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతి చెందారు.
ఎంఈవో మృత్యువాత
కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండి (Choppadandi) పట్టణానికి చెందిన ఎంఈవో బత్తుల భూమయ్య (57) శనివారం తెల్లవారుజామున వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా చేస్తున్నారు. అలాగే, వెల్గటూర్ మండలంలోని ముత్తునూరు, ముక్కటరావుపేట, కప్పారావుపేట గ్రామాల ప్రత్యేకాధికారిగా ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ గా విధులు చేపట్టారు. శుక్రవారం విధులు ముగించుకుని అస్వస్థతతో ఇంటికి చేరుకున్నారు. రాత్రి వాంతులు, విరేచనాలతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.
అటు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామానికి చెందిన రైతు దయ్యాల జంగమ్మ (58) శనివారం లాల్ దర్వాజలో కూరగాయలు విక్రయించారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సెక్కి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. సీటులోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ కు చెందిన వంక లక్ష్మి (70), భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన మేకల లక్ష్మయ్య (56), కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలానికి చెందిన బొల్లబోయిన వనమాల (45), జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన కొమురం సోము (58) ఎండదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో శనివారం కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో నిప్పుల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్, ధర్మపురి మండలం జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7, నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో 46.3, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 44.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు, రాష్ట్రంలో తేమ శాతం కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది. శనివారం అత్యల్పంగా హైదరాబాద్ లోనే 15 శాతం, మహబూబ్ నగర్ లో 19 శాతం ఉంది. ఈ క్రమంలో రాత్రిపూట కూడా వేడిగాలులు ప్రభావం చూపుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పగటి పూట బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం వడగాలులు వీచే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)