IPL 2026 RCB: ఐపీఎల్ 2026కు ముందే ఛాంపియన్ ఆర్సీబీకి గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
RCB M chinnaswamy stadium | విరాట్ కోహ్లీతో పాటు RCB అభిమానులకు శుభవార్త వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లకు కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది.

IPL 2026 ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు శుభవార్త వచ్చింది. బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ గెలిచిన తర్వాత RCB ఈ స్టేడియంలో విక్టరీని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమం ఇక్కడ నిర్వహించింది. అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరగడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఈ వేదికలో మ్యాచ్లు నిర్వహించడంపై నిషేధం విధించారు.
ESPNcricinfo నివేదిక ప్రకారం, కొత్తగా ఎన్నికైన KSCA చీఫ్, టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఎన్నికైన వారం రోజుల తర్వాత కర్ణాటక ప్రభుత్వం నుండి మ్యాచ్లు నిర్వహించడానికి అనుమతి పొందారు. దాంతో బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం BCCI రాడార్లోకి తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది. BCCIకి కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్ ప్రసాద్ తాజా పరిణామాల గురించి తెలియజేసినట్లు సమాచారం.
IPL 2026 ముందు కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో ఆడతారా?
నివేదికల ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2026 లో తమ సొంత మ్యాచ్లను M చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందని స్పష్టంగా ఉంది. కానీ ఈ లీగ్కు ముందే కోహ్లీ అక్కడ ఆడటం చూడవచ్చు. ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఇక్కడ ఆడే అవకాశం ఉంది. డొమోస్టిక్ పరంగా చూస్తే ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నందున విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. జాతీయ జట్టుకు ఆడని సమయంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆటగాళ్లకు కండీషన్ పెట్టడం తెలిసిందే.
నివేదికల ప్రకారం, భద్రతా, లాజిస్టికల్ సమస్యల కారణంగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లను ఆలూరు నుండి మార్చాలని భావిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్లు ఢిల్లీ జట్టులో చేరారు. మొదటి మూడు మ్యాచ్లకు ఈ ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో ఉండవచ్చు.
విజయ్ హజారే ట్రోఫీలో అభిమానులకు ప్రవేశం
నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఆడే మ్యాచ్ల కోసం ప్రజలకు కొన్ని స్టాండ్లను తెరవాలని KSCA పరిశీలిస్తోంది. 2,000 నుండి 3,000 మంది ప్రేక్షకులకు అవకాశం కల్పించడానికి అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడినప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం బయట పెద్ద ఎత్తున అభిమానులు కనిపించారు. దాంతో డొమెస్టిక్ గేమ్ సమయంలో వారి ఆట చూసేలా అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.





















