T20 World Cup Semifinal: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు అయితే సెమీఫైనల్స్ చేరేది ఎవరు ?
IND vs WI Semi-final Equation: వర్షం కారణంగా భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ రద్దైతే, నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ఏ జట్టు సెమీ-ఫైనల్కు చేరుకుంటుందో టీమిండియా ఫ్యాన్స్కు తెలిసిందే.

టి20 వరల్డ్ కప్ 2026: భారత్ వర్సెస్ వెస్టిండీస్ - సెమీఫైనల్ రేసులో నిలిచేది ఎవరు?
కోల్కతా: టి20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఈరోజు (మార్చి 1) రాత్రి కీలక పోరు జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. అయితే కోల్కతాలో వర్షం పడినా, లేక ఏదైనా కారణంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాక రద్దు చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే, సెమీఫైనల్కు ఏ జట్టు వెళ్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
గ్రూప్-1లో ఉన్న టీమిండియా, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే చెరో 2 మ్యాచ్లు ఆడాయి. రెండింటికీ ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. ఓ మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ ఓడి సమానంగా ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. దీనివల్ల విండీస్, భారత్ జట్ల పాయింట్లు 3-3 కి చేరుతాయి.
పాయింట్లు సమానమైనప్పుడు సెమీఫైనల్ బెర్త్ ఎవరికి దక్కుతుందనే నిర్ణయం నెట్ రన్రేట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం నెట్ రన్రేట్ విషయంలో వెస్టిండీస్ జట్టు ముందంజలో ఉంది. కనుక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే వెస్టిండీస్ సెమీఫైనల్కు చేరుకుంటుంది. అందుకే నేడు కచ్చితంగా మ్యాచ్ జరిగి, సూర్యకుమార్ సేన విజయం సాధించాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ - హెడ్ టు హెడ్ రికార్డులు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 టి20 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 19 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, వెస్టిండీస్ 10 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. అయితే టీ20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. మొత్తం నాలుగు మ్యాచులలో భారత్, విండీస్ జట్లు తలపడగా 3 సార్లు కరేబియన్ జట్టు నెగ్గా, టీమిండియా ఓ మ్యాచులో విజయం సాధించింది.
సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి
సూపర్-8 దశలో భారత్, వెస్టిండీస్ రెండు జట్లు కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలయ్యాయి. అయితే జింబాబ్వేపై మాత్రం 2 జట్లు విజయం సాధించాయి. ఇప్పటివరకూ సమ ఉజ్జీలుగా ఉన్న జట్లు నేటి రాత్రి సెమీఫైనల్స్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు నెగ్గుతుందా అని భారత్, విండీస్ ఫ్యాన్స్ హై వోల్టేట్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నారు.





















