Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....
జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని చెప్పే మహా అద్భుత ఆలయాల్లో ఒకటి పూరీ జగన్నాథ్. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత ఉంది.

ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి..
పక్షులు ఎగరని ఆలయం..ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

అయోధ్యా మధురా మాయా
కాశీ కాంచీ అవంతికా
పూరీ ద్వారావతీచైవ
సప్తైతే మోక్షదాయకా!!
దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో పూరీ ఒకటి. సోదరుడు బలభద్రుడితో, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు.

పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు.

అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను...విద్యాపతి ప్రేమ వివాహం చేసుకుంటాడు. జగన్నాథుడి విగ్రహాన్ని చూపించాలని మావగారైన విశ్వావసుడిని పదేపదే అడుగుతాడు విద్యాపతి. అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజనరాజు...కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. తెలివిగా వ్యవహరించిన విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. ఈ మేరకు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప దుంగలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు.

కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో రాచమందిరానికి చేరుకుంటాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించిన రాజు అటుగా ఎవ్వరూ వెళ్లకూడదని భటులను ఆదేశిస్తారు. రోజులు గడుస్తున్నా విశ్వకర్మ గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. లోపల శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను 8 నుంచి 12 లేదా 19 సంవత్సరాలకి ఓసారి మార్తి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టిస్తూ ఉంటారు . దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు . ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు కళ్లు చాలవు.

రథాయాత్ర సమయంలో ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరిస్తారు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు రథంపై సిద్ధంగా ఉన్న ఉత్సవమూర్తులకు… పూరీ సంస్థానాధీశులు నమస్కరించి…స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. అంతరం యాత్ర మొదలవుతుంది.

పూరీ జగన్నాథుడి ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. ఆలయ గోపురంపై ఉండే జెండా... వీచేగాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది. గోపురంపై ప్రతిష్టించిన సుదర్శన చక్రం ఎట్నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఈ ఆలయంపై పక్షలు ఎగరకపోవడం ఓ వింత. గోపురం నీడ... సూర్యోదయం-సూర్యాస్తమయం సమయంలోనూ ఎక్కడా కనిపించకపోవడం విశేషం. సాధారణంగా గాలి పగటిపూట సముద్రంపైనుంచి భూమిపైకి... సాయంత్రం భూమిపైనుంచి సముద్రంపైకి వీస్తుంది. కానీ పూరీ క్షేత్రంలో దీనికి విరుద్ధంగా గాలి వీస్తుంది. స్వామి నివేదనకు ముందు ఎలాంటి వాసనా రాని ప్రసాదం నైవైద్యం సమర్పించిన తర్వాత ఘుమఘుమలాడిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రథయాత్ర ముగిసే గుండీచా ఆలయం వద్ద రథం తనంతట తానే ఆగిపోవడం స్వామివారి మహిమ.

జగన్నాథుడికి నివేదించే 56రకాల పదార్థాలు మట్టి కుండల్లోనే వండుతారు. ఆలయానికి అత్యంత సమీపంలో సముద్రం ఉన్నా లోపల అలల శబ్దాలు వినిపించవు. ఇంకా ఎన్నో విశిష్టతలు, రహస్యాలు, మహిమలు కలిగిన పూరీక్షేత్రం మానవాళికి వరప్రసాదం...
Before You Go
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















