West Bengal Politics: బెంగాల్లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
TMC Rebellion: బెంగాల్లో దీదీ సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందరూ మేనల్లుడు అభిషేక్ను చూపించి పార్టీ వదిలిపోతున్నారు. అయితే మమత మాత్రం అభిషేక్ను సమర్థిస్తూ భావోద్వేగ రాజకీయాలు చేస్తున్నారు.

Bengal Voters Sentiment Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉప్పెనలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఒంటరి పోరాటాలతో కమ్యూనిస్టుల కోటలను బద్దలు కొట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మమతా బెనర్జీ.. ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీని వీడిపోతున్న తిరుగుబాటుదారులను ద్రోహులు గా అభివర్ణిస్తూనే, పార్టీ నెంబర్-2 అభిషేక్ బెనర్జీని సమర్థిస్తూ సెంటిమెంటల్ రాజకీయాలునడుపుతున్నారు. "అభిషేక్ నా సింహం.. అతడు పులిలా పోరాడుతున్నాడు" అంటూ దీదీ ప్రయోగించిన ఈ సెంటిమెంట్ అస్త్రం వెనుక బెంగాల్ను దశాబ్దాలుగా ఏలిన ఒక బలమైన ప్రాంతీయ శక్తే కుప్పకూలుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అభిషేక్ తప్పులు చేసి ఉంటే క్షమించాలని వేడుకోలు
మమతా బెనర్జీ ప్రసంగంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆర్తనాదం.. ఒకవైపు పార్టీని కాపాడుకోవడం, మరోవైపు తన ఏకైక రాజకీయ వారసుడైన అభిషేక్ బెనర్జీని సురక్షిత తీరాలకు చేర్చడం అనే ద్విముఖ వ్యూహంతో ఉంది. అభిషేక్ ఒకవేళ ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి అంటూ ఆమె బహిరంగంగా కోరడం కేడర్ను సైతం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దీదీ ఇంతలా సెంటిమెంట్ను నమ్ముకోవడం వెనుక.. అంతర్గతంగా టీఎంసీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రంగా చేజారిపోతోందనే చేదు నిజాన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ బట్టబయలు చేస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోతున్న లీడర్లు, క్యాడర్ల నుంచి రక్షించుకోవడానికి ' పాత సెంటిమెంట్ ఇమేజ్ను ఆమె మళ్లీ తెరపైకి తెచ్చారు.
క్యాడర్ లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నం
2004లో మా పార్టీ కేవలం ఒక్క సీటుకు పడిపోయినా మళ్లీ లేచాను, ఒకవేళ అంతా శూన్యమైనా సరే నేను మళ్లీ సున్నా నుంచి పార్టీని నిర్మిస్తా అంటూ మమత విసిరిన సవాలు ఆమెలోని పోరాట పటిమను చూపిస్తున్నప్పటికీ, నాటి 2004 నాటి పరిస్థితులకు, నేటి బెంగాల్ రాజకీయాలకు నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. నాడు ఆమె వెనుక యువత, మేధావులు, మార్పును ఆశించిన క్షేత్రస్థాయి శ్రేణులు ఉన్నారు. కానీ నేడు, బెంగాలీ సగటు ఓటరు టీఎంసీని ఒక ప్రజాపోరాటాల పార్టీగా కంటే.. కుటుంబ ప్రయోజనాల కోసం, వారసత్వ రాజకీయాల కోసం ప్రాకులాడుతున్న సంస్థగా చూసే ప్రమాదం ముంచుకొచ్చింది. దీదీ వృద్ధాప్యంలోకి జారుకుంటున్న వేళ.. అభిషేక్ను లీడర్గా అంగీకరించడానికి పార్టీలోని పాతతరం నేతలే వెనుకాడటం ఆమె ఒంటరితనాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సెంటిమెంట్ అస్త్రంపై బెంగాలీ ఓటర్ల స్పందన మిశ్రమంగా ఉంది. సోషల్ మీడియాలో ఒక వర్గం దీదీ ఒంటరి పోరాటాన్ని అభినందిస్తూ సానుభూతి ప్రకటిస్తుంటే, మెజారిటీ తటస్థ ఓటర్లు మాత్రం ఈ కుటుంబ సెంటిమెంట్ ను తిరస్కరిస్తున్నారు. కేవలం అభిషేక్ బెనర్జీ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ రక్షణ కవచంపై బెంగాల్ యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లో భావోద్వేగ ప్రసంగాలు కొన్నిసార్లు అద్భుతాలు చేయవచ్చు, కానీ అన్నీ కోల్పోయిన పార్టీకి సెంటిమెంట్ మాత్రమే శ్రీరామరక్ష కాలేదు. మమతా బెనర్జీ డిజిటల్ స్క్రీన్లపై ఏడవడం వల్ల పొలిటికల్ మైలేజ్ రావడం కష్టమే. ప్రజలు నేరుగా తమ బతుకుదెరువును చూసుకుంటారే తప్ప పదిహేనేళ్ల పాటు పాలించి ఓడిపోయిన పార్టీ గురించి ఆలోచించరు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ శకం ఒక చారిత్రాత్మక ఘట్టం. కానీ, ఆమె తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముగింపు దశలో ఒక సమర్థవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాల్సింది పోయి, కేవలం అభిషేక్ అనే ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ ఇరుక్కుపోయారని భావిస్తున్నారు. ఒకవేళ క్షేత్రస్థాయిలో తిరుగుబాటుదారుల వలసలు ఇలాగే కొనసాగితే.. కోలుకోవడం కష్టమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















