YSRCP Politics: కల్తీ నెయ్యి కేసులో అసెంబ్లీలో టీడీపీకి వాకోవర్ ఇచ్చిన వైసీపీ - నష్టం అంచనా వేయలేనంత!
YS Jagan: అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ తన వాదన చెప్పుకోలేకపోయింది.బయట ఎన్ని చెప్పినా అదంతా రాజకీయమే అవుతుంది.

Adulterated ghee politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు వైసీపీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా ఆ పార్టీ తన వాదనను బలంగా వినిపించే అవకాశాన్ని చేజార్చుకుంది.
కూటమి వ్యూహం.. ఏకపక్షంగా సాగిన ఆరోపణలు
లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంధించిన విమర్శలు వైసీపీ మూలాలను కదిలించాయి. హిందూ ధర్మంపై, పవిత్రమైన తిరుమల ప్రసాదంపై ప్రణాళికాబద్ధంగా దాడి జరిగిందని ప్రభుత్వం గట్టిగా వాదించింది. సభలో వైసీపీ సభ్యులు లేకపోవడంతో అధికార కూటమి నేతలు తాము చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచారు. రికార్డుల్లోనూ ఇవే అంశాలు నమోదయ్యాయి. ఒకవేళ వైసీపీ సభ్యులు సభలో ఉంటే, ఈ ఆరోపణలను అక్కడికక్కడే తిప్పికొట్టే అవకాశం ఉండేది.
మీడియా సమావేశాలు.. రికార్డుల్లోకి ఎక్కని వాదనలు
వైసీపీ నేతలు అసెంబ్లీ బయట ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, అవి కేవలం రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయి. అసెంబ్లీ రికార్డుల్లో ఉండే బలం వీటికి ఉండదు. ప్రభుత్వ ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పే అద్భుతమైన వేదికను ఆ పార్టీ వదులుకుంది. సభలో ఉండి వాస్తవాలను వివరించి ఉంటే ప్రజల్లో కొంతవరకైనా నమ్మకం కలిగేది. కానీ ఇప్పుడు కేవలం అధికార పక్షం వినిపించిన వాదనలే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
సానుభూతి పొందే అవకాశం చేజారిందా?
ప్రజాస్వామ్యంలో సభకు హాజరై పోరాడటం అత్యంత ముఖ్యం. ఒకవేళ వైసీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే, సభ నుంచి వాకౌట్ చేయడం లేదా నిరసన తెలపడం ద్వారా ప్రజల సానుభూతి పొందే వీలుండేది. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లే అని గట్టిగా చెప్పి ఉంటే బాగుండేది. కానీ అసలే రాకపోవడం వల్ల, ఆరోపణలకు భయపడి పారిపోయారనే ముద్ర పడే ప్రమాదం ఏర్పడింది. ఇది రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చింది.
హిందూత్వ సెంటిమెంట్.. వైసీపీకి ఇబ్బందికరంగా మారిన వైనం
చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూను కేవలం పాలనాపరమైన లోపంగా కాకుండా, హిందూత్వ సెంటిమెంట్తో ముడిపెట్టారు. వైసీపీ అధినాయకత్వంపై వచ్చిన ప్రత్యక్ష ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఇలాంటి సున్నితమైన అంశంపై అసెంబ్లీలో వివరణ ఇవ్వకపోవడం వల్ల, భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రజల్లో వివరణ ఇచ్చుకోవడం కష్టంగా మారనుంది. తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి లభించిన అతిపెద్ద వేదికను వైసీపీ స్వయంగా వదులుకుంది.
రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం
అసెంబ్లీకి వెళ్లకపోవడమే ఇప్పుడు వైసీపీ చేసిన అతిపెద్ద తప్పిదంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన ఆరోపణలు రికార్డుల్లో శాశ్వతంగా ఉండిపోతాయి. భవిష్యత్తులో ఈ అంశాన్ని కూటమి నేతలు ఎన్నికల అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే, ప్రజాక్షేత్రంలో మరింత బలహీనపడే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఉంటేనే తమ గొంతు ప్రజలకు చేరుతుందనే కనీస సత్యాన్ని వైసీపీ విస్మరించినట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.























