Chandrababu Assembly: శ్రీవారిపై వైసీపీ చేసింది మహాపాపం - అసెంబ్లీలో సంచలన విషయాలు బయటపెట్టిన సీఎం చంద్రబాబు
Laddu adulteration case: శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీని హిందూత్వంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెయ్యి కల్తీ అంశంపై అసెంబ్లీలో సంచలన విషయాలు బయట పెట్టారు.

Chandrababu Naidu statement in the Assembly on the adulterated ghee case: తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన లడ్డూ కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం శాసనసభలో జరిగిన ఈ చర్చలో సీఎం చంద్రబాబు మహాపాపం పేరుతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలను లెక్కలతో సహా వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అధికారులు, పాలకులు కలిసి చేసిన ఈ కుట్రను ఆయన తీవ్రంగా ఖండించారు.
20 కోట్ల కల్తీ లడ్డూల పంపిణీ
2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో భారీగా కల్తీ నెయ్యిని వినియోగించారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం అక్రమమే కాదని, కోట్ల మంది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు.
60 లక్షల కిలోల కల్తీ నెయ్యి
గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిలో దాదాపు 59.71 లక్షల కిలోలు కల్తీగా తేలిందని సీఎం వివరించారు. ఈ నెయ్యి కొనుగోలు కోసం అప్పట్లో సుమారు రూ. 231.51 కోట్లు ఖర్చు చేశారని, అయితే నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని నెయ్యిని సేకరించడం ద్వారా భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
ఎన్డీడీబీ రిపోర్టుపై క్లారిటీ
లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయాన్ని తాను రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పలేదని, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇచ్చిన అధికారిక నివేదిక ఆధారంగానే ఆ నిజం బయటపడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ భగవంతుడే నా చేత ఈ నిజాన్ని బయటపెట్టించాడు అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. కల్తీ అని రిపోర్టులు వచ్చినా గత పాలకులు వాటిని తొక్కిపెట్టారని ఆయన విమర్శించారు.
వ్యవస్థీకృత నేరంగా అభివర్ణన
నెయ్యి సరఫరాలో ఒక సిండికేట్ ఏర్పడి ప్రణాళికాబద్ధంగా ఈ కల్తీకి పాల్పడ్డారని సీఎం తెలిపారు. ఫోరెన్సిక్ సాక్ష్యాలు కూడా దీనిని బలపరుస్తున్నాయని, ఇది ఒక వ్యవస్థీకృత నేరమని ఆయన పేర్కొన్నారు. కేవలం లాభాపేక్షతోనే కాకుండా, హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకతతో కూడా ఇలాంటి పనులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
కఠిన చర్యలు - ఏకసభ్య కమిటీ
ఈ అక్రమాలపై ఇప్పటికే సిట్ (SIT) విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు సూచనల మేరకు విచారణ ప్రక్రియ కొనసాగుతోందని ముఖ్యమంత్రి సభకు తెలిపారు. కేవలం లడ్డూల అంశమే కాకుండా, తిరుమలలో జరిగిన ఇతర పాలనాపరమైన అక్రమాలను వెలికితీసేందుకు ఒక ఏకసభ్య కమిటీని కూడా నియమించినట్లు వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.
భవిష్యత్తు ప్రణాళిక - ప్రత్యేక చట్టం
తిరుమల పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో టీటీడీకి కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దేవాలయ నియమాలను ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందిస్తామని, భవిష్యత్తు లో ఇలాంటి 'మహాపాపాలు' పునరావృతం కాకుండా అరికడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.























