Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Shabbir Ali Audio Leak: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనంతటికి కారణం పార్టీలోని వర్గ పోరాటమేనని చెప్పాల్సిన పని లేదు.

Meenakshi Natarajan Rajya Sabha Controversy: తెలంగాణ కాంగ్రెస్లో 'కయ్యాల సంస్కృతి' మరోసారి బహిర్గతమైంది. అధికారంలోకి వచ్చి పరిపాలన సాగిస్తున్నప్పటికీ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, నేతల మధ్య సమన్వయ లోపం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాలతో రద్దయిన వివాదం సల్లారకముందే.. పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసే మరో సరికొత్త వివాదం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ మహ్మద్ షబ్బీర్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో లీక్ కావడం ఇప్పుడు టీపీసీసీ లో రేకెత్తిస్తున్న ప్రకంపనలకు అద్దం పడుతోంది.
మహేష్ కుమార్ పై షబ్బీర్ అలీ ఆరోపణలు
దాదాపు మూడు నెలల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ ఆడియో క్లిప్లో.. షబ్బీర్ అలీ పార్టీ అంతర్గత పోకడలపై, ముఖ్యంగా ప్రస్తుతం పార్టీ బాధ్యతలు చూస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని, లూప్హోల్స్ను వాడుకుంటూ ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా అందులోని వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబ్బు ఇస్తే కొనుక్కోగలిగే పార్టీగా మారిపోయింది అని దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్న ఒక సీనియర్ నేత నోట రావడం కేవలం ఒక వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదు.. పార్టీలో అంతర్గతంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న తీవ్ర అసమ్మతికి ఇది నిదర్శనం.
ఆధిపత్య పోరు కారణంగానే సమస్యలు
కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ను టార్గెట్ చేస్తూ వ్యతిరేక ప్రచారం మరియు లీక్ల పర్వం వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక ఆధిపత్య పోరు దాగి ఉందన్నది స్పష్టమవుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలతో పాలనలో బిజీగా ఉంటే, మరోవైపు సంస్థాగతంగా పార్టీని నడిపించే పీసీసీ పీఠంపై కొందరు సీనియర్లు మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. తమను కాదని వలస వచ్చిన వారికో, లేదా జూనియర్లకో ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన పాత కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఇటువంటి ఆడియో క్లిప్పింగులను అస్త్రాలుగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
మీనాక్షి కేసు సమాచారం తెలంగాణ నుంచే వెల్లిందా?
ఈ వ్యవహారాని ముందే జరిగిన మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఉదంతం కూడా ఈ అంతర్గత కుట్రల కోణాన్ని బలపరుస్తోంది. తెలంగాణకు సంబంధించిన ఒక పాత ప్రైవేట్ కోర్టు కేసు వివరాలను మీనాక్షి తన అఫిడవిట్లో దాచారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆమె నామినేషన్ రద్దయింది. అయితే, ఇక్కడి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్లో పోటీ చేస్తున్న మీనాక్షికి వ్యతిరేకంగా ఆ కోర్టు పత్రాలను, లీగల్ నోటీసులను స్వయంగా తెలంగాణ కాంగ్రెస్లోని ఒక వర్గమే శత్రుపక్షానికి చేరవేసిందంటూ బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంటే, సొంత పార్టీ ఇన్ఛార్జ్ను ఓడించడానికి లేదా దెబ్బతీయడానికి రాష్ట్ర నేతలే వెన్నుపోటు పొడిచారనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది.
ఈ రెండు పరిణామాలను కలిపి చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ సాంప్రదాయక బలహీనత అయిన సొంత పార్టీ నేతలే కాళ్లు లాగడం అనేది అధికారంలో ఉన్నప్పుడు కూడా మారలేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. పీసీసీ చీఫ్పై వ్యతిరేక ప్రచారం ఒకవైపు, నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య టికెట్లు, పదవుల లొల్లి మరోవైపు పార్టీ క్యాడర్ను అయోమయంలో పడేస్తోంది. ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటూ, ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకుని లీక్ చేసే స్థాయికి దిగజారడం పార్టీ క్రమశిక్షణను ప్రశ్నిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్కు ఇప్పుడు బయట ఉన్న విపక్షాల కంటే లోపల ఉన్న 'సొంత శత్రువుల' నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. అధికారంలో ఉన్నాం కదా అనే ధీమాతో అంతర్గత కుమ్ములాటలను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే, అది ప్రభుత్వంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















