Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
Delimitation Bill India: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కీలక మార్పులకు సాక్ష్యంగా ఉండనున్నాయి. డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో రాజ్యాంగ సవరణ చేయనున్నారు.

Parliament All Party Meeting: జూలై 20 నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సభను సజావుగా నడిపేందుకు వీలుగా ప్రభుత్వం జూలై 19న సర్వపక్ష సమావేశాన్ని అధికారికంగా నిర్వహించబోతోంది. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఎజెండాలో కేవలం ఇన్కమ్ టాక్స్ అమెండ్మెంట్, నేషనల్ హానర్ ప్రొటెక్షన్ వంటి 5 కొత్త బిల్లులు, రెండు పాత బిల్లులు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం దేశ భవిష్యత్తును, ఎన్నికల సరళిని శాసించే భారీ బిల్లుల గురించిన చర్చలే పొలిటికల్ సర్కిల్స్లో మార్మోగిపోతున్నాయి.
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం—130వ రాజ్యాంగ సవరణ బిల్లు పై ప్రభుత్వం వెనుకడుగు వేయడం. కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, 30 రోజుల పాటు జైలులో ఉంటే వారి పదవి ఆటోమేటిక్గా రద్దయిపోయేలా తెచ్చిన ఈ బిల్లుపై తీవ్ర చట్టపరమైన, రాజకీయపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నేరం నిరూపితం కాకముందే, కేవలం అరెస్ట్ ఆధారంగా పదవి నుంచి తొలగించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమనే వాదనలు రావడంతో, ఈ సమావేశాల ఎజెండాలో దీనిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, దీని స్థానంలో దేశ ముఖచిత్రాన్ని మార్చే డీలిమిటేషన్ , మహిళా రిజర్వేషన్లు, వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లులను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందనే టాక్ గట్టిగా నడుస్తోంది.
మహిళా రిజర్వేషన్ల అమలు ఖాయం
నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ల అమలు పరస్పరం ముడిపడి ఉన్న అంశాలు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటాను క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే, ముందుగా లోక్సభ సీట్ల సంఖ్య పెరగాల్సి ఉంది. దీనికోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న యూనిఫాం 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను సైతం ఆలోచనలో పడేసింది. గతంలో జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే ఉత్తరాదికే లాభమని గగ్గోలు పెట్టిన దక్షిణాది పార్టీలు , ఇప్పుడు ఏ రాష్ట్రానికీ సీట్లు తగ్గకుండా ఉన్న స్థానాలను 50 శాతం పెంచే ఈ మోడల్కు దాదాపు లోపాయకారీగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లు కనుక ఈ సమావేశాలలో చట్టరూపం దాల్చితే, దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల సంఖ్య 800 దాటిపోనుంది. ఇది ప్రాంతీయ పార్టీల ఉనికిని, పార్లమెంట్లో వారి బలాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మైలురాయి కానుంది.
ఒకే దేశం - ఒకే ఎన్నికలు బిల్లు కూడా
దీనికి తోడు, బిజెపి ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు కూడా ఈ వర్షాకాల సమావేశాలలోనే పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే, దేశంలో నిరంతరం సాగే ఎన్నికల కోడ్ హడావుడికి, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడానికి అడ్డుకట్ట పడుతుంది. అయితే, దీనివల్ల ప్రాంతీయ అంశాల కంటే జాతీయ అంశాలే ఎక్కువగా హైలైట్ అవుతాయని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లుల చుట్టూ జరిగే చర్చలు పార్లమెంట్లో అధికార, విపక్షాల మధ్య తీవ్రమైన పొలిటికల్ వార్కు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్యాంగసవరణతో ఊహించని మార్పులు
ఈ సమావేశాలను మోదీ 3.0 ప్రభుత్వానికి ఒక కీలకమైన పరీక్ష. 130వ సవరణ బిల్లును ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టడం ద్వారా ప్రభుత్వం విపక్షాల విమర్శలకు తావివ్వకూడదని భావించినప్పటికీ, డీలిమిటేషన్ , వన్ నేషన్ ఎలక్షన్ వంటి బిల్లుల ద్వారా దేశాన్ని ఒక సరికొత్త పొలిటికల్ ట్రాక్పైకి తీసుకువెళ్లాలని చూస్తోంది. ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు ఎన్డీయే కూటమి లోపాయకారీగా కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడింది. జూలై 20 నుండి ప్రారంభం కాబోయే ఈ సమావేశాలు కేవలం సాధారణ చట్టాల ఆమోదానికే పరిమితం కావు. అధికారిక ఎజెండా వెనుక దాగి ఉన్న ఈ సంచలనాత్మక బిల్లులు కనుక సభ ముందుకు వస్తే, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సరికొత్త శకం ప్రారంభమవుతుంది. రాష్ట్రాల సరిహద్దులు, ఎన్నికల విధానాలు, మరియు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని శాశ్వతంగా మార్చివేసే ఈ బిగ్ బిల్స్ పై పార్లమెంట్లో ఎలాంటి హైడ్రామా నడవబోతోందో రాబోయే మూడు వారాల్లో తేలనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















