Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
KBR Park One Way Traffic: హైదరాబాద్లో నరకంగా మారిన ట్రాఫిక్. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే, ఐటీ కారిడార్లో గంటల తరబడి జామ్లు, గుంతల రోడ్లపై పౌరుల ఆగ్రహం. ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది?

Gachibowli IT Corridor Traffic: విశ్వనగరంగా గ్లోబల్ మ్యాప్పై మెరుస్తున్న హైదరాబాద్లో ప్రయాణం రోజురోజుకూ సగటు పౌరుడికి ఒక నరకప్రాయ అనుభవంగా మారుతోంది. ఐటీ రంగానికి గుండెకాయ లాంటి గచ్చిబౌలి, మాదాపూర్ కారిడార్ల నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వరకు ప్రయాణించాలంటే గంటల తరబడి రోడ్లపైనే నరకం చూడాల్సి వస్తోంది. ఇటీవల హెచ్-సిటీ ఫ్లైఓవర్ , అండర్పాస్ పనుల నెపంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్-వే విధానాన్ని అమలులోకి తీసుకురావడం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. పైలట్ డ్రైవ్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాల అవగాహన లేక, అశాస్త్రీయమైన డైవర్షన్ల వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
మరోవైపు గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రధాన రహదారులతో పాటు కనెక్టింగ్ రోడ్లు అన్నీ భారీ గోతులతో నిండిపోయాయి. వర్షాలు పడినప్పుడల్లా మోకాటి లోతు నీరు చేరడం, ఆ గుంతల్లో వాహనాలు చిక్కుకుపోవడంతో ఐటీ ఉద్యోగుల రాకపోకలు గంటల కొద్దీ ఆలస్యమవుతున్నాయి. సీఎస్ఆర్, మున్సిపల్ రోడ్డు మరమ్మతుల పేరుతో ప్రచారం జరుగుతున్నా, వాస్తవానికి జిహెచ్ఎంసి , సైబరాబాద్ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పనుల ప్రక్రియ నెమ్మదిగా సాగడం, మరమ్మతులకు వాడే క్వాలిటీ మెటీరియల్ లోపించడం వల్ల వాన పడగానే వేసిన ప్యాచ్ వర్క్లు కొట్టుకుపోయి రోడ్లు మళ్లీ అధ్వానంగా తయారవుతున్నాయి.
అన్ని వైపుల నుంచి ఒకే సారి పనులు
ఇంతటి తీవ్రమైన సమస్యను ప్రభుత్వం, సంబంధిత శాఖలు సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోవడానికి ప్రధానంగా సమన్వయ లేమి కారణం. ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మంజీరా డిజైన్ టీమ్లు, రహదారుల నిర్మాణ సంస్థల మధ్య ముందస్తు ప్రణాళికలు ఉండటం లేదు. ఒకరు రోడ్డు వేస్తే, మరొకరు కేబుల్స్ లేదా పైప్లైన్ల కోసం దాన్ని తవ్వేస్తున్నారు. పైగా మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు వర్క్ స్పేస్ అంచనా వేసి రాత్రి వేళల్లో వేగంగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా, పగటిపూట కూడా ఆంక్షలు విధించి సివిల్ వర్క్స్ సాగదీస్తుండటం వల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్ కుదేలవుతోంది.
రాజకీయంగానూ ఈ అంశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు, ఐటీ రంగానికి చెందిన ప్రొఫెషనల్స్ ప్రభుత్వం అందించే మౌలిక వసతుల పట్ల అత్యంత సున్నితంగా ఉంటారు. ఒకవైపు పన్నులు చెల్లిస్తూ, మరోవైపు రోడ్లపై గంటల కొద్దీ వేచి చూడాల్సి రావడం వల్ల పరిపాలనా వైఫల్యం అనే ముద్ర బలంగా పడే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ ట్రాఫిక్ కష్టాలను, వర్షాకాలంలో గుంతల రోడ్ల చిత్రాలను సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చించి స్టాగర్డ్ వర్కింగ్ అవర్స్. హైబ్రిడ్ డ్రైవ్లను ప్రోత్సహించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు ప్రజల నుంచి వస్తున్నాయి.
సమస్య నిర్వహణలేనే ఉందని నమ్ముతున్న ప్రజలు
హైదరాబాద్కు ట్రాఫిక్ అనేది కేవలం ఒక రవాణా సమస్య కాదు, అది నగరం ఆర్థిక పురోగతికి, గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్కు ముడిపడి ఉన్న అంశం. అధికారులు మసకబారిన పాత ప్రణాళికలను పక్కనపెట్టి, ప్రజా ప్రతినిధులు, పోలీసు శాఖ , సివిల్ ఇంజనీరింగ్ విభాగాలను ఒకే తాటిపైకి తెచ్చి యుద్దప్రాతిపదికన స్పందించకపోతే.. ఈ ట్రాఫిక్ గందరగోళం ప్రభుత్వం పట్ల పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిగా రూపాంతరం చెందడం ఖాయం. భవిష్యత్ లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయవచ్చు కానీ ఇప్పుడు ప్రజలు భరించలేనంతగా కష్టపడితే ప్రభుత్వానికే ఇబ్బంది.
ట్రెండింగ్ వార్తలు





















