Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Kiren Rijiju: దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కు షెడ్యూల్ ఖరారైంది. జూలై 20 నుండి ప్రారంభం కానున్న ఈ కీలక సమావేశాల్లో రాజ్యాంగసవరణ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు.

Important Bills Parliament Monsoon Session 2026: దేశ అత్యున్నత చట్టసభ అయిన భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఉభయ సభలను సమావేశపరిచేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. జూలై 20, 2026 నుండి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు ఆగస్టు 13, 2026 వరకు నిరంతరాయంగా సాగనున్నాయి.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. భారత ప్రభుత్వ సిఫార్సుల మేరకు, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలు-2026 నిర్వహణకు ఆమోదం తెలిపారు. జూలై 20 నుండి ప్రారంభమై ఆగస్టు 13 వరకు ఈ సెషన్స్ కొనసాగుతాయి. జాతీయ ప్రాధాన్యత కలిగిన వివిధ కీలక అంశాలపై, బిల్లులపై చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులు , నిర్ణయాలు జరగడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. దాదాపు నాలుగు వారాల పాటు సాగే ఈ విడత సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగ్స్ ఉండేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ సమావేశాల కంటే ముందే.. జూలై 17న అత్యంత వివాదాస్పదమైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించనుంది. తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయి 30 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే పీఎం, సీఎంలు పదవుల నుండి ఆటోమేటిక్గా తొలగిపోయే క్లాజ్ ఇందులో ఉండటంతో విపక్షాలు దీనిపై రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వర్షాకాల సమావేశాలు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, విపక్ష ఇండియా కూటమికి మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి వేదిక కానున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు ను ఈ సెషన్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితో పాటు, గత సమావేశాల్లో తిరస్కరణకు గురైన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం రీ-ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది.
On the recommendation of the Govt of India, Hon’ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026.
— Kiren Rijiju (@KirenRijiju) July 4, 2026
The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,… pic.twitter.com/TaEYH4F1cK
మరోవైపు, పార్లమెంట్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు కూడా ఈ సెషన్పై ఆసక్తిని పెంచుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లోని తిరుగుబాటు ఎంపీల విలీనం, శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీల వ్యవహారాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సమావేశాల లోపే కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ మధ్య మారిన సమీకరణాలతో సభలో సీట్ల కేటాయింపులపై కూడా మార్పులు జరగనున్నాయి. దేశ ఆర్థిక ప్రగతి, రక్షణ రంగ సవాళ్లు, అంతర్గత భద్రతతో పాటు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటుండటంతో.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















