Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
TDP: తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ టెక్నాలజీ సాయంతో దారిలో పెడుతున్నారు. అదే సమయంలో ఫీల్డ్ లో ప్రజల మధ్యనే పార్టీ నేతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Nara Lokesh is trying to disrupt the party affairs: తెలుగుదేశం పా జాతీయ ప్రధాన కార్యదర్శి , మంత్రి నారా లోకేష్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై తనదైన ముద్ర వేస్తున్నారు. పార్టీని సాంకేతికంగా పరిపుష్టం చేస్తూ, అట్టడుగు స్థాయి కార్యకర్తలతో నేరుగా సంబంధాలు నెలకొల్పుకుంటూ TDP 3.0 అనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
TDP 3.0 - జవాబుదారీతనం , ప్రజల భాగస్వామ్యం
లోకేష్ ఇటీవలే TDP 3.0 వెర్షన్ను లాంచ్ చేశారు. ఇది కేవలం ఒక నినాదం కాదు, పార్టీని మరింత శక్తివంతంగా, జవాబుదారీతనంతో నడిపించే ఒక వ్యవస్థ. ఇందులో భాగంగా కార్యకర్తలకు నేరుగా గుర్తింపు ఇవ్వడం, వారి పనితీరును అంచనా వేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీని ఒక నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం గా తీర్చిదిద్దాలని, ఏడాదికి కనీసం 300 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎమ్మెల్యేలు , ఇంచార్జ్ల పనితీరుపై నిఘా
పార్టీలో క్రమశిక్షణ విషయంలో లోకేష్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మళ్లీ గెలవాలంటే ప్రజల మధ్యే ఉండాలి అని ఎమ్మెల్యేలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా, ఇసుక లేదా ఇతర అక్రమ రవాణాలో పాల్గొన్నా సహించేది లేదని తెగేసి చెప్పారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును, ప్రజల్లో వారికున్న ఇమేజ్ను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా అంచనా వేస్తూ, గ్రాఫ్ పడిపోయిన వారికి క్లాస్ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 85కు పైగా ప్రజా దర్బార్లు నిర్వహించి, వేలాది మంది అర్జీలను స్వయంగా స్వీకరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉదయాన్నే అందుబాటులో ఉంటూ, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం సామాన్య ప్రజలకే కాకుండా, పార్టీ కార్యకర్తలకు కూడా తమ నాయకుడిని నేరుగా కలిసే ధైర్యాన్ని ఇస్తోంది.
My TDP యాప్ - టెక్నాలజీతో పార్టీ పర్యవేక్షణ
సాంకేతికతపై పట్టున్న లోకేష్, పార్టీ పర్యవేక్షణ కోసం My TDP యాప్ను సమర్థవంతంగా వాడుతున్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో ఏ కార్యకర్త చురుగ్గా ఉన్నారో, ఏ బూత్ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉందో డేటా రూపంలో విశ్లేషిస్తున్నారు. పనితీరు ఆధారంగానే పదవులు, గుర్తింపు ఉంటాయని స్పష్టం చేయడం ద్వారా పార్టీలో సమర్థులకు ప్రాధాన్యత లభిస్తోంది. పారిశ్రామిక వేత్తల తరహాలో డాష్ బోర్డ్ మేనేజ్మెంట్ ద్వారా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం ఆయన పనితీరుకు నిదర్శనం. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను లోకేష్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వైసీపీ హయాంలో కేసులు ఎదుర్కొన్న వారిని ఆదుకోవడంతో పాటు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం వంటి వేదికలపై సామాన్య కార్యకర్తలకు సీనియర్ నేతలతో సమానంగా గౌరవం కల్పిస్తున్నారు. పదవులు మూడు సార్లు మాత్రమే అనే కొత్త ప్రతిపాదన ద్వారా కొత్త రక్తాన్ని పాలిట్బ్యూరో స్థాయికి చేర్చాలని ఆయన చూస్తున్నారు. ఇది యువ నాయకత్వంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఫ్యూచర్ లీడర్ గా ఎదుగుదల
లోకేష్ కేవలం చంద్రబాబు వారసుడిగా కాకుండా, తనకంటూ ఒక సొంత పనితీరు బ్రాండ్ ను సృష్టించుకున్నారు. అడ్మినిస్ట్రేషన్లో చురుగ్గా ఉంటూనే, పార్టీ యంత్రాంగాన్ని 24/7 అలెర్ట్గా ఉంచడంలో ఆయన సఫలీకృతమవుతున్నారు. లోకేష్ అనుసరిస్తున్న ఈ కార్పొరేట్ తరహా రాజకీయ వ్యూహం, అట్టడుగు స్థాయి కార్యకర్తలతో ఉన్న అనుబంధం టీడీపీని రాబోయే దశాబ్ద కాలానికి సిద్ధం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















