Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Mavigun Joker: జగన్ని మావిగన్ జోకర్ గా అభివర్ణిస్తూ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి, రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు.

Jagan Mohan Reddy Mavigun Joker : పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కేవలం వైఎస్సార్ పేరును వాడుకున్నారే తప్ప, ఆయన ఆశయాలకు ఏనాడూ వారసుడు కాలేదని ఆమె మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చారిత్రాత్మక ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమై నేటికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ప్రారంభమైన ఆ పాదయాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చిందని, కానీ నేడు జగన్ పాలనలో ఆ స్వర్ణయుగం కనుమరుగైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి మావిగన్ జోకర్
జగన్ మోహన్ రెడ్డిని మావిగన్ జోకర్ గా అభివర్ణిస్తూ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ప్రకృతి సిద్ధమైన రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, ఇప్పుడు మావిగన్ వంటి వింత వింత పేర్లతో ప్రజల ముందు నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని తుంగలో తొక్కి ఓన్లీ క్యాష్ మాఫియాగా మారారని దుయ్యబట్టారు.
బీజేపీకి జగన్ దత్తపుత్రుడు
వైఎస్సార్ ఐడియాలజీ గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని షర్మిల స్పష్టం చేశారు. నిజంగా వైఎస్సార్ ఆశయాలే వైసీపీకి ప్రాతిపదిక అయితే, ముఖ్యమంత్రిగా ఉండి కూడా వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన జలయజ్ఞాన్ని జగన్ ఎందుకు పూర్తి చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా మారారని, దేశవ్యాప్తంగా దళితులు, క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరుగుతున్నా మౌనంగా ఉండి ఆనాడు వైఎస్సార్ సంపాదించిన ప్రతిష్టను మంటగలుపుతున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై ఎందుకు పోరాడరు?
ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్సార్ ప్రజల కన్నీళ్ల నుంచి పుట్టించినవని షర్మిల గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నా జగన్ మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. వైఎస్సార్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే వైఎస్సార్ అని.. ఆయన ఆశయాలు మళ్ళీ బ్రతకాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం
వైసీపీ క్యాడర్ అంతా కాంగ్రెస్ లోకి రావాలి!
మహానేత ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క వైఎస్సార్ అభిమాని హస్తం పార్టీతో జతకట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ఆనాడు వైఎస్సార్ అందించిన సంక్షేమ పాలనను మళ్లీ రాష్ట్రంలో తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. జగన్ ప్యాలెస్ల రాజకీయాలకు, అరాచక పాలనకు అంతం పాడాలని, రాజశేఖర రెడ్డి నిజమైన వారసులైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నడవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.























