Modi Cabinet Reshuffle: పార్లమెంట్కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
Constitutional Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ పై రాజ్యాంగసవరణలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

Modi Amit Shah Surprise Political Strategy: న్యూఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ అగ్రనాయకత్వంలో అంతర్గత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చేయబోతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జోరందుకుంది. ఇందుకు సంబంధించి పొలిటికల్ సర్కిల్స్లో ఇన్ అండ్ అవుట్ లిస్టులు, కొత్తగా మంత్రిపదవులు దక్కే ప్రాబబుల్స్ పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అవుతున్నాయి. అయితే, ఈసారి జరగబోయే విస్తరణ కేవలం కొందరికి పదవులు ఇచ్చి, మరికొందరిని తొలగించే సాధారణ ప్రక్రియ కాదు. ఇది రాబోయే రోజుల్లో దేశ రాజకీయ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక మిడ్-టర్మ్ రీసెట్ అని స్పష్టమవుతోంది.
ఈ సారి మంత్రివర్గ విస్తరణను పార్లమెంట్ సమావేశాల కంటే ముందే పూర్తి చేయాలనుకోవడం వెనుక మోదీ-షా ద్వయం ఒక భారీ వ్యూహాత్మక రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపాదించబోతోంది. ముఖ్యంగా గతేడాది చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లును క్షేత్రస్థాయిలో తక్షణమే అమలు చేయడానికి వీలుగా.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. సభలో ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి ఏకంగా 850 సీట్లకు పెంచేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న పాత నిబంధనలను సవరిస్తూ, 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త సరిహద్దులను నిర్ణయించే అధికారాన్ని పార్లమెంట్కు కట్టబెట్టడం ఇందులో అత్యంత కీలకం.
కొత్త టీమ్తోనే కీలక నిర్ణయాలు
ఈ చారిత్రాత్మక బిల్లులను పార్లమెంట్లో నెగ్గించుకోవడానికి పూర్తి స్థాయి సమర్థులైన, దూకుడు ప్రదర్శించే మంత్రుల బృందం అవసరమని మోదీ భావిస్తున్నారు. అందుకే, గతంలో విఫలమైన మంత్రులను, అండర్ పర్ఫార్మర్లను తొలగించి.. కూటమి భాగస్వామ్య పక్షాల సమీకరణాలకు లోబడి కొత్త ముఖాలకు క్యాబినెట్లో చోటు కల్పించనున్నారు. జూన్ చివరి వారంలో ప్రధాని మోదీ నిర్వహించిన హై-లెవెల్ సమీక్షా సమావేశాలు, వికసిత్ భారత్ రోడ్మ్యాప్ చర్చలు కూడా ఈ విస్తరణకు బలమైన పునాదిగా మారాయి. ఈ కీలకమైన బిల్లులను ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పాస్ చేయిస్తారా.. లేక గతంలో మాదిరిగానే విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా హఠాత్తుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆమోదింపజేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏ పని చేసినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా.. ఎలాంటి లీకులు ఇవ్వకుండా, అత్యంత నిశ్శబ్దంగా తమ వ్యూహాన్ని అమలు చేయడంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలన్నీ ఇలాంటి సైలెంట్ ఆపరేషన్ల ద్వారానే సాధ్యమయ్యాయి.
ఈ సారి క్యాబినెట్ విస్తరణ ముగిశాక, పార్లమెంట్ లోపల జరిగే సవరణల పర్వం భారత రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు కాబోతోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవాలన్నా, 850 సీట్లతో కొత్త పార్లమెంట్ పూర్తి స్థాయిలో కళకళలాడాలన్నా.. ఈ రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. విపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తమ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడంలో సిద్ధహస్తులైన మోదీ-షా.. ఈ వర్షాకాల సమావేశాల వేదికగా దేశానికి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















