Kaleshwaram project investigation politics: కాళేశ్వరంపై పొలిటికల్ గేమ్ - విచారణ పేరుతో ఆరోపణలే - మరి ప్రజలకు నిజాలెప్పుడు తెలుస్తాయి?
Kaleshwaram inquiry : కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ రాజకీయాలు మూడు పార్టీలకు కీలకంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ విచారణ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Kaleshwaram project inquiry politics: కాళేశ్వరం ప్రాజెక్టు.. ఒకప్పుడు తెలంగాణ గర్వకారణంగా, అపర భగీరథ ప్రయత్నంగా ప్రచారమైంది. కానీ, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు బయటపడటంతో ఈ మెగా ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ పార్టీల మెడకు చుట్టుకున్న విషమ పరీక్ష గా మారింది. ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, అది కేవలం సాంకేతిక లోపమేనని నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ మాత్రం ఈ అంశాన్ని కేవలం ఒక రాజకీయ అస్త్రంగానే వాడుకుంటున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ - విచారణలో జాప్యంపై ప్రశ్నలు
ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని, అధికారంలోకి రాగానే విచారణ జరిపించి దోషుల నుంచి ప్రజాధనాన్ని కక్కిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా విచారణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ సాగుతున్నప్పటికీ, ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేంద్రాన్ని కోరడం వెనుక తన బాధ్యతను కేంద్రంపైకి నెట్టివేసే వ్యూహం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏజెన్సీలతో పూర్తిస్థాయి క్రిమినల్ విచారణ జరపకుండా, కేవలం నివేదికలను కేంద్రానికి పంపి సైడ్ అయిపోవడంపై సామాన్య ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ వ్యూహం - ఆరోపణలకే పరిమితమా?
బీజేపీ కూడా కాళేశ్వరం అవినీతిపై భారీ ఎత్తున గళమెత్తింది. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ ప్రధాని, కేంద్ర మంత్రులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసినా, కేంద్రం ఇంకా ఎందుకు రంగంలోకి దిగలేదన్నది ఒక మిస్టరీగా మారింది. విచారణ జరిపితే ఎక్కడ బీఆర్ఎస్ పట్ల సానుభూతి పెరుగుతుందో లేదా రాజకీయ సమీకరణాలు మారతాయో అన్న సందేహంతోనే బీజేపీ వెనకడుగు వేస్తోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆరోపణలు చేయడం తప్ప, యాక్షన్ తీసుకోవడంలో కేంద్రం జాప్యం చేయడంపై విపక్షాలు ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ఆత్మరక్షణ
మేడిగడ్డ కుంగుబాటు బీఆర్ఎస్కు పెను రాజకీయ సమస్యగా మారింది. ప్రాజెక్టు డిజైన్లలో లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు స్పష్టం చేయడంతో, ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. అయితే, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని, మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును రాజకీయాల కోసం బలిపెట్టవద్దని, వెంటనే నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిజాల కోసం ప్రజల నిరీక్షణ
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా కాళేశ్వరంపై పూర్తిస్థాయి వాస్తవాలను బయటపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయే తప్ప, అసలు దోషులు ఎవరు? ఆ సొమ్ము ఎక్కడికి పోయింది? మేడిగడ్డ ఎందుకు కుంగింది? అనే ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలు ప్రజలకు అందడం లేదు. రాజకీయం ముసుగులో నిజాలు సమాధి అవుతున్నాయని సామాన్యులు భావిస్తున్నారు. కాళేశ్వరం కేవలం రాజకీయాల వేదిక కాకూడదు, అది ప్రజల ఆస్తి అనే స్పృహతో అన్ని పార్టీలు వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని డిమాండ్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















