INDIA Alliance Splits: ప్రాంతీయ పార్టీల్లో చీలికలు - ఇండీ కూటమిలో ప్రకంపనలు - మరి కాంగ్రెస్ ఎంపీలు సైలెంట్గా ఉంటారా?
Congress Defections: ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరిపోతున్నారు.దీని కోసం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. మరి కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీతోనే ఉంటారా?

BJP Strategy Anti Defection Law: జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. విపక్షాల ఇండీ కూటమిలో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో పడింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు ఎన్సీపీఐ పార్టీలో విలీనం అయ్యారు. దీనికి తోడు డీఎం కూటమి నుంచి బయటకు రావడం, ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఏకంగా బీజేపీలో విలీనమవ్వడం చూస్తుంటే, ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో బీజేపీ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన కూడా చీలిపోయింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీలపై కూడా ఇదే తరహా కత్తి వేలాడుతోంది. అయితే ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్లో ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది... ప్రాంతీయ పార్టీలన్నింటినీ చీలుస్తున్న బీజేపీ వ్యూహకర్తలు, కాంగ్రెస్ పార్టీని మాత్రం అలానే వదిలేస్తారా?
కాంగ్రెస్ ఎంపీలు ఖాళీగా ఉంటారా?
ప్రాంతీయ పార్టీల నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార ఎన్డీయే వైపు లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిశ్శబ్దంగా ఉండరనే సంకేతాలు అందుతున్నాయి. కేంద్రంలో మూడోసారి బలమైన అధికారంలో ఉన్న బీజేపీ, ప్రస్తుతం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రాంతీయ పార్టీల ఎంపీలను లాక్కోవడంతో పాటు, కాంగ్రెస్లోని అసంతృప్త ఎంపీలపై కూడా కన్నేసింది. రాజకీయం ఎటువైపు మొగ్గుతుందో గమనించే కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం లోపాయికారీగా అధికార పక్షంతో టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం.
యాంటీ-డిఫెక్షన్ లా చిక్కుముడులు
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారితే వారి పదవులు ఊడిపోతాయి. కానీ, మొత్తం ఎంపీలలో మూడింట రెండొంతుల మంది కలిసి విడిపోతే లేదా వేరే పార్టీలో విలీనమైతే చట్టబద్ధంగా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆప్ విషయంలో రాఘవ్ చద్దా సరిగ్గా ఇదే ఫార్ములాను వాడారు. తృణమూల్ ఎంపీలదీ ఇదే ఫార్ములా. ఇప్పుడు కాంగ్రెస్లోనూ ఇదే తరహా గ్రూపును తయారు చేయడం బీజేపీ వ్యూహకర్తలకు అసాధ్యమేమీ కాదు. ప్రాంతీయ పార్టీలలోనైనా, కాంగ్రెస్లోనైనా విచ్ఛిన్నానికి ప్రధాన కారణం అంతర్గత అసంతృప్తి, బలమైన నాయకత్వం లేకపోవడమే. ఎన్నికల్లో ఓటములు, కూటముల వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎంపీలలో రక్షణ లేని భావన మొదలవుతుంది. ఈ బలహీనతనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ముడిసరుకుగా వాడుకుంటుంది. ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి , రాజకీయ మనుగడ కోసం లొంగిపోతుంటే, కాంగ్రెస్ ఎంపీలు సైతం తాము ఎన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలనే నైరాశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
బీజేపీ అల్టిమేట్ ప్లాన్ - కాంగ్రెస్ ముక్త్ భారత్
బీజేపీ అగ్రనాయకత్వానికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ఎంత ముఖ్యమో, తమ ప్రధాన జాతీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ను కోలుకోకుండా చేయడం అంతకంటే ముఖ్యం. ప్రాంతీయ పార్టీల పతనం పూర్తి కాగానే, అవసరమైన తరుణంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోనే అతిపెద్ద చీలిక తెచ్చి, ఆ పార్టీని పార్లమెంట్లో నామమాత్రంగా మార్చాలనేది తెరవెనుక వ్యూహం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలు బీజేపీలో విలీనమైన చరిత్ర ఉంది. అదే ఫార్ములాను ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎంపీలపై ప్రయోగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇండీ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే!
ప్రస్తుత పార్లమెంట్ నెంబర్ గేమ్ చూస్తుంటే, ఎన్డీయే కూటమి క్రమంగా రాజ్యసభలో మెజారిటీకి చేరువవుతోంది, లోక్సభలోనూ బలపడుతోంది. డీఎంకే, తృణమూల్, ఆప్ లాంటి శక్తులే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేస్తున్న తరుణంలో... కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలను ఎంతవరకు కాపాడుకోగలదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలలో గనుక చీలిక వస్తే, అది ‘ఇండీ’ కూటమి పతనానికి ఆఖరి మేకు కొట్టినట్లవుతుంది.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















