TDP Internal Politics: ఎమ్మెల్యేల గుండెల్లో చంద్రబాబు ర్యాంకుల వణుకు - తప్పు చేస్తే వేదికలపైనే క్లాస్ .. కావలి ఘటనతో మారిన పొలిటికల్ సీన్
MLA Performance Report: టీడీపీలో ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. అదే చంద్రబాబు రిపోర్ట్ కార్డ్ . చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Chandrababu Stern Warning To TDP Mlas: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెర్షన్ 4.0 పరిపాలనలో మునుపటి కంటే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తప్పు చేసిన ఎమ్మెల్యేలను పిలిచి సున్నితంగా మందలించే చంద్రబాబు, ఇప్పుడు ప్రజా సమక్షంలోనే వారి రిపోర్ట్ కార్డులను బయటపెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో జరిగిన ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి విషయంలో బాబు వ్యవహరించిన తీరు, మిగిలిన 174 నియోజకవర్గాల నేతలకు ఒక గట్టి హెచ్చరికలా మారింది. 107వ ర్యాంకు అంటూ ప్రజల ముందే లెక్కలు తేల్చడంతో తమ్ముళ్లలో వణుకు మొదలైంది.
డేటా ఆధారిత హెచ్చరికలు
చంద్రబాబు ఈసారి గాలిలో విమర్శలు చేయడం లేదు. ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో 51 ప్రభుత్వ శాఖల పనితీరును ఆయన నిశితంగా గమనిస్తున్నారు. కావలిలో 13 కీలక శాఖలు వెనుకబడి ఉన్నాయని, ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతోందని టెక్నికల్ డేటాతో సహా నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేస్తే కృష్ణారెడ్డి 107వ స్థానంలో ఉన్నారని చెప్పడం ద్వారా.. తాను ప్రతి నిమిషం ఎవరి రికార్డును ఎలా ట్రాక్ చేస్తున్నారో స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి ర్యాంకులు, పనితీరుపై చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాల్లో క్లాస్ తీసుకుంటారు. కానీ కావలి సభలో వేలాది మంది ప్రజలు, ప్రత్యర్థులు చూస్తుండగానే ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు. మారకపోతే ఊరుకోను అని వేదికపైనే హెచ్చరించారంటే, చంద్రబాబు ఏ స్థాయిలో అసహనంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం కృష్ణారెడ్డికి మాత్రమే కాదు, పనితీరు మెరుగుపరుచుకోని ప్రతి ఎమ్మెల్యేకు పంపిన స్ట్రాంగ్ మెసేజ్ .
కావలిలో ఎమ్మెల్యే తీరుపై గతంలోనే పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా సీనియర్ నేతలతో కలుపుకుపోవడంలో విఫలమవ్వడం, వర్గ రాజకీయాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అందరినీ కలుపుకుని పోవాల్సిందే అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని వాడు నియోజకవర్గాన్ని ఏం పాలిస్తాడనే కోణంలో బాబు వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ప్రభువులు కాదు, సేవకులు అని ఆయన మరోసారి గుర్తుచేశారు.
సినిమాటిక్ కాదు.. సిస్టమాటిక్
చంద్రబాబు తీరులో వచ్చిన ఈ మార్పు వెనుక ఒక వ్యూహం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల వల్లే ఆ పార్టీకి అధికారం పోయిందని బాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈసారి కూటమి ఎమ్మెల్యేలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. లీడర్లు మారకపోతే తానే ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి సిద్ధమనే సంకేతాన్ని కావలి వేదికగా స్పష్టం చేశారు. " మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్న ఈ కఠిన వైఖరి టీడీపీలో కొత్త క్రమశిక్షణను తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ప్రజల ముందే ఎమ్మెల్యేలను నిలదీయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నది బాబు ఆలోచన. అయితే, ఇది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదనే వాదన కూడా వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















