Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Israel Iran War: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు పెంచడంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. దీంతో యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది.

Iranian attacks on Gulf countries: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్లతో జరుగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ తన దాడుల పరిధిని పెంచింది. తాజాగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ , బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులతో కువైట్ విమానాశ్రయంలోని రాడార్ వ్యవస్థ దెబ్బతినగా, ఒమన్ దేశంలోని సలాలా ఓడరేవుపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక కార్మికుడు గాయపడటంతో పాటు మౌలిక సదుపాయాలకు స్వల్ప నష్టం వాటిల్లింది.
గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తున్న ఇరాన్
అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నాయన్న కారణంతో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలపై దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలను రోజంతా చిన్న చిన్న విడతలుగా కొనసాగిస్తూ, ఇజ్రాయెల్ పౌరులను నిరంతరం భయాందోళనకు గురిచేసే సైకలాజికల్ వార్ ను అమలు చేస్తోంది. మరోవైపు, అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ షెడ్యూల్ కంటే వేగంగా సాగుతోందని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, ఆయుధ తయారీ కేంద్రాలను తాము భారీగా దెబ్బతీశామని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది.
ఇంకా కొలిక్కిరాని హర్మూజ్ వద్ద పరిస్థితులు
వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం నుంచే జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని పాక్షికంగా మూసివేయడం, తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో గల్ఫ్ దేశాలు సహనం కోల్పోతున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇరాన్ దాడులకు ప్రతిఘటనగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో కలిసి యుద్ధంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
హర్మూజ్ వద్ద భారత నౌకలకు నేవీ రక్షణ
ఈ యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయ నౌకల రక్షణ కోసం భారత నౌకాదళం అప్రమత్తమైంది. చమురు ఉత్పత్తులతో వస్తున్న రెండు భారతీయ వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధిని దాటుతున్న సమయంలో, వాటికి రక్షణగా భారత యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. గతంలో జరిగిన దాడుల్లో ఒక భారతీయుడు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న తమ పౌరుల భద్రతపై భారత్ నిశితంగా గమనిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు జరపాలని ప్రధాని మోదీ ఇదివరకే విజ్ఞప్తి చేశారు.
ఇరాన్లో తిరుగుబాటు వస్తుందని ట్రంప్ ఆశ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించేందుకు 15 అంశాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము ఎటువంటి చర్చల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయితే ఇరాన్ అంతర్గతంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పాటు ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి యుద్ధం ముగిసే సంకేతాలు కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.























