నౌక గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తోంది. దీని పేరు ఎం.వి. గోల్డెన్ లియో.
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Indians Died | ఉక్రెయిన్ తీరంలో గినియా-బిస్సావు నౌకపై రష్యా చేసిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించగా, నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

- ఉక్రెయిన్ తీరం వదిలిన వాణిజ్య నౌకపై రష్యా క్షిపణి దాడి.
- ఈ దాడిలో నలుగురు భారతీయులు సహా పదిమంది మృతి.
- భారత్ తీవ్రంగా ఖండించి, రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ.
Russia Attacks Ukraine | ఉక్రెయిన్ తీరం నుండి బయలుదేరుతున్న గినియా- బిస్సావు జెండాతో వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై రష్యా దాడి చేసింది. నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయ పౌరులతో సహా మొత్తం 10 మంది మృతిచెందారు. భారతీయులు మృతిచెందిన ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఘర్షణ, ఉద్రిక్తతల సమయంలో మరోసారి వాణిజ్య నౌకల భద్రతపై భయాందోళన నెలకొంది.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా రష్యా చేసిన దాడిపై స్పందించారు. రష్యా ఆదివారం నాడు ఉక్రెయిన్ సముద్ర కారిడార్ నుంచి వెళ్తున్న ఒక నౌకపై దాడి చేసింది. ఆ నౌక సిబ్బందిలో సిరియా, భారత పౌరులు ఉన్నారని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్కు చెందిన నావికులు, సిబ్బంది చనిపోయిన తొలి ఘటన ఇది.
నౌకపై రష్యా మిస్సైల్స్ దాడి చేసింది: ఉక్రెయిన్
గినియా- బిస్సావు జెండాతో వెళ్తున్న నౌకపై రష్యా క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఎం.వి. గోల్డెన్ లియో అనే ఈ వాణిజ్య నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది, సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురు భారత పౌరులు ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేయడాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు నివారించాలి అని పేర్కొంది.
రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన భారత విదేశాంగశాఖ
ఉక్రెయిన్లోని ఒడెసా రేవులో ఓ నౌకపై జరిగిన దాడిలో భారతీయులు మృతిచెందడంపై రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. నౌకపై దాడికి సంబంధించి రష్యా దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్కు భారత్ తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ దాడిపై స్పందించిన MEA ఏం చెప్పింది?
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిపై స్పందించింది. ' ఆదివారం (జూలై 19) సాయంత్రం, ఎంవి గోల్డెన్ లియో ఒడెస్సా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రష్యా దాడి చేసింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దురదృష్టవశాత్తు నలుగురు భారత పౌరులు మరణించారు. ఒక భారత పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని' తెలిపింది.
ఉక్రెయిన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రభావిత వారికి సాధ్యమైన అన్ని రకాల సహాయం చేయడానికి ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతిచెందిన భారతీయ పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన భారత పౌరుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రష్యా పేరును ప్రస్తావించని భారత్
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యా పేరును నేరుగా ప్రస్తావించలేదు. 'భారత్ ఇటువంటి దాడులను ఖండిస్తుంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం లేదా షిప్పింగ్, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ దేశం కూడా అలా దాడులు చేయకూడదు' అని స్పష్టం చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులు బలైపోవడం సరికాదని పేర్కొన్నారు.
Frequently Asked Questions
దాడికి గురైన వాణిజ్య నౌక ఏ దేశం జెండాతో ప్రయాణిస్తోంది?
ఈ దాడిలో ఎంతమంది భారతీయులు మరణించారు?
ఈ దాడిలో నలుగురు భారతీయ పౌరులు మరణించారు. ఒక భారత పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ దాడిపై భారత ప్రభుత్వం ఎలా స్పందించింది?
భారత ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండించింది. రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
దాడి ఎక్కడ, ఎప్పుడు జరిగింది?
ఈ దాడి జూలై 19 సాయంత్రం, ఉక్రెయిన్లోని ఒడెస్సా నౌకాశ్రయం నుండి బయలుదేరుతుండగా జరిగింది. రష్యా క్షిపణులతో దాడి చేసింది.
ట్రెండింగ్ వార్తలు























