International Space Station : 2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
ISS crash: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్నిదక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయాలని నాసా నిర్ణయించింది. 2031 దీనికి ముహుర్తంగా నిర్ణయించారు.

International Space Station will be crashed: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని భూమిపైకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అంతరిక్షంలో పరిశోధనలకు నిలయంగా ఉన్న ఈ భారీ కేంద్రాన్ని 2031 ప్రారంభంలో పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత మారుమూల ప్రాంతంలో కూల్చివేయాలని నాసా నిర్ణయించింది. ఈ అద్భుతమైన అంతరిక్ష ప్రయోగశాల తన పదవీ విరమణ తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించి, మంటల్లో కాలిపోతూ సముద్ర గర్భంలో కలిసిపోనుంది.
పాయింట్ నిమో- అంతరిక్ష నౌకల శ్మశానవాటిక
వఅంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేసేందుకు శాస్త్రవేత్తలు భూమిపై అత్యంత ఏకాంతమైన ప్రదేశం పాయింట్ నిమో ను ఎంచుకున్నారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతం ఏ వైపు నుంచి చూసినా భూభాగానికి దాదాపు 2,700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనుషులు కానీ, ఓడలు కానీ ఉండే అవకాశం అస్సలు లేదు. అందుకే దీనిని అంతరిక్ష నౌకల శ్మశానవాటిక అని పిలుస్తారు. గతంలో రష్యాకు చెందిన మీర్ అంతరిక్ష కేంద్రంతో పాటు వందలాది ఉపగ్రహాలను ఇక్కడే కూల్చివేశారు.
కూల్చివేత ప్రక్రియ ఇలా
ఫుట్బాల్ మైదానమంత పరిమాణం ఉండే ISSను నేరుగా కూల్చడం సాధ్యం కాదు. అందుకే నాసా దీని కోసం ప్రత్యేకంగా స్పేస్ ఎక్స్ నిర్మించే డీఆర్బిట్ వాహనాన్ని ఉపయోగించనుంది. ఈ వాహనం అంతరిక్ష కేంద్రాన్ని నెమ్మదిగా కిందికి నెడుతూ, నిర్దేశిత సమయంలో భూ వాతావరణంలోకి తీసుకువస్తుంది. వాతావరణంలోని ఘర్షణ కారణంగా ISSలోని చాలా భాగాలు మంటల్లో కాలిపోతాయి. మిగిలిన భారీ లోహపు ముక్కలు ఎవరికీ హాని కలగకుండా పాయింట్ నిమో వద్ద సముద్రంలో పడిపోతాయి.
ఒక శకం ముగింపు
1998లో ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో అమెరికా, రష్యా, యూరప్, జపాన్ , కెనడా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి నిరంతరాయంగా వ్యోమగాములు ఇక్కడ నివసిస్తూ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. 2030 వరకు దీని కార్యకలాపాలను పొడిగించిన నాసా, ఆ తర్వాత ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. మానవ మేధస్సుకు నిదర్శనంగా నిలిచిన ISS అంతం కావడం అంతరిక్ష చరిత్రలో ఒక శకం ముగింపుగా మిగిలిపోనుంది.
మానవాళికి ఎంతో మేలు చేసిన ఐఎస్ఎస్
గత మూడు దశాబ్దాలుగా మానవాళికి ఐఎస్ఎస్ అందించిన సేవలు అసమానమైనవి. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో, శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిరంతరం సాగే ఈ పరిశోధనలు వైద్యం, భౌతిక శాస్త్రం , పర్యావరణ రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన ప్రోటీన్ స్ఫటికీకరణ, నీటి శుద్ధి ప్రక్రియలు, అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి వంటి అంశాలపై ఇక్కడ జరిగిన ప్రయోగాలు భూమిపై కోట్లాది మందికి మేలు చేస్తున్నాయి. అంతేకాకుండా, సుదూర అంతరిక్ష ప్రయాణాల్లో మానవ శరీరంపై కలిగే ప్రభావాలను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో చంద్రుడు,అంగారక గ్రహాలపై మానవ యాత్రలకు ISS బలమైన పునాది వేసింది. 15 దేశాలకు చెందిన వ్యోమగాములు కలిసి పనిచేయడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి ఇది ఒక గొప్ప చిహ్నంగా నిలిచింది.























