Tamil Nadu exit polls: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ గందరగోళం - డీఎంకే, అన్నాడీఎంకేకే కాదు విజయ్ పార్టీకీ చాన్స్ !
Tamil Nadu : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. మెజార్టీ సర్వేలు డీఎంకే విజయాన్ని అంచనా వేస్తున్నాయి కానీ యాక్సిస్ మై ఇండియా విజయ్ ముందంజలో ఉన్నారని తేల్చింది.

Tamil Nadu exit polls : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ అంచనాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. వివిధ జాతీయ , ప్రాంతీయ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. తంతి టీవీ, పుతియ తలైమురై వంటి ప్రముఖ తమిళ ఛానళ్లతో కొన్ని ఇతర సంస్థళు డీఎంకే కూటమికి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , నెలవారీ ఆర్థిక సాయం వంటివి డీఎంకేకు అనుకూలంగా పనిచేసినట్లు ఈ అంచనాలు విశ్లేషిస్తున్నాయి.
మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వైపు
ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే గత ఎన్నికలతో పోలిస్తే తన బలాన్ని గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో పార్టీ గట్టి పోటీని ఇచ్చిందని, ముఖ్యంగా పశ్చిమ తమిళనాడులో తన పట్టును నిలబెట్టుకుందని రిపబ్లిక్-సీ ఓటర్ , చాణక్య సర్వేలు పేర్కొన్నాయి. డీఎంకేకు పూర్తి స్థాయిలో ఏకపక్ష విజయం దక్కకుండా అన్నాడీఎంకే అడ్డుకోగలిగిందని, దాదాపు 70 నుండి 90 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని ఈ సంస్థలు అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజయ్ గెలుపును అంచనా వేసిన యాక్సిస్ మై ఇండియా
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభావం. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్, అంచనాలను మించి రాణించినట్లు మెట్రైజ్, పుతియ తలైమురై సర్వేలు చెబుతున్నాయి. టీవీకే ద్వారా విజయ్ సంచలనం సృష్టించబోతున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార పార్టీ డీఎంకే కు 110 స్థానాల దరిదాపుల్లోనే సీట్లు వస్తాయని అంచనా వేసింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని కూటమికి కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ, వారి సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు సాగడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు ఉన్నాయని, లేదా స్వల్ప తేడాతో ఎవరో ఒకరు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను ను అందుకుంటారని ఈ సర్వే విశ్లేషిస్తోంది.
అన్నాడీఎంకే గెలుపును అంచనా వేసిన పీపుల్స్ పల్స్, జన్ కీ బాత్
మరోవైపు, కొన్ని సర్వేలు ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు సంభవించవచ్చని, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషించాయి. పీపుల్స్ పల్స్, జన్ కీ బాత్ వంటి కొన్ని స్వతంత్ర సంస్థల అంచనాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత , అధికార పక్షంపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రతిపక్ష కూటమికి వరంగా మారాయి. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని పక్కా వ్యూహాలు, ప్రధాని మోదీ ఛరిష్మా తోడవ్వడంతో అన్నాడీఎంకే కూటమి మ్యాజిక్ ఫిగర్ 118ని దాటి 120 నుండి 130 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వేలు పేర్కొన్నాయి. ముఖ్యంగా డీఎంకే ఓట్లను విజయ్ పార్టీ చీల్చడం వల్ల కలిగే ప్రయోజనం అంతిమంగా అన్నాడీఎంకే కూటమినే విజయతీరాలకు చేరుస్తుందని ఈ కథనాలు వెల్లడించాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















