Bride Sisters Suicide: ఒకేరోజు అక్కాచెల్లెళ్ల పెళ్లికి ముహూర్తం.. కొన్ని గంటల ముందు ఇద్దరు ఆత్మహత్య!
Jodhpur Bride Sisters Suicide: జోధ్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు వధువుల వివాహ ఊరేగింపు జరగాల్సి ఉండగా.. అంతకు కొన్ని గంటల ముందే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇటీవల యూపీలోని ఘజియాబాద్లో ఒకేసారి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శనివారం (ఫిబ్రవరి 21) రాత్రి జోధ్పూర్ నగరానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శోభ (25), విమల (23) తమ పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు అని కుటుంబసభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
జోధ్పూర్లోని మనాయి గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఒకేరోజు వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో శనివారం (ఫిబ్రవరి 21) ఊరేగింపు జరగాల్సి ఉంది. కానీ అంతకు కొన్ని గంటలముందే వారు విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. అప్పటివరకూ పెళ్లి వేడుకలతో ఉత్సాహంగా ఉన్న కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందని భావించిన తల్లిదండ్రులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రివరకు సంబరాల్లో మునిగిపోయారు. కానీ తెల్లవారేసరికి ఆ సంతోషం కాస్తా విషాదంగా మారింది.
ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు
యువతులు విషం తాగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారిని హుటాహుటిన చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఏడీసీపీ (పశ్చిమ) రోషన్ మీనా మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వధువులు (అక్కాచెల్లెళ్లు) నిద్రపోవడానికి వెళ్లారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఇద్దరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే బంధువులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే వారు చనిపోయారు. మృతిచెందారని డాక్టర్లు నిర్ధారించిన తరువాత కుటుంబ సభ్యులు యువతుల అంత్యక్రియల కోసం మృతదేహాలను ఇంటికి తీసుకువచ్చారు.
అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు
ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్కాచెల్లెళ్ల అంత్యక్రియల ప్రక్రియను నిలిపివేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాతే కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించామని అధికారులు తెలిపారు.
ఇద్దరు పెళ్లికూతుళ్లు విషం తాగడం వల్లే మరణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. మృతుల వద్ద ఎలాంటి ఆత్మహత్య లేఖ (సుసైడ్ నోట్) లభించలేదని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో అక్కాచెల్లెళ్లకు ఒకేసారి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. కానీ పెళ్లికి కొన్ని గంటల ముందు వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
























