Petrole Diesel Exice Duty: పెట్రోల్, డీజిల్పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?
పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ నిర్నయం తీసుకుంది.

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. గురువారం విడుదల చేసిన జీవో ప్రకారం, పెట్రోల్ పై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారు. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.10 నుంచి 0కి తగ్గించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..
కేంద్రం చేసిన పన్నుల తగ్గింపు వల్ల సామాన్య వినియోగదారులకు పెట్రోల్ తక్కువ ధరకు లభించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పంపు విక్రయాలపై ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ తగ్గింపును అవే వినియోగించుకునే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 100 అమెరికన్ డాలర్లు దాటాయి. దీనివల్ల ప్రస్తుతం ఓఎంసీలు విక్రయించే ప్రతి లీటరు పెట్రోల్ లేదా డీజిల్పై రూ. 48.8 నష్టపోతున్నాయి. రష్యా కంపెనీ రోస్నెఫ్ట్, కేసాని ఎంటర్ప్రైజెస్ మద్దతు ఉన్న దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ, పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 5.3, రూ. 3 పెంచిన తరువాత రోజే ప్రభుత్వం ఈ ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించిన కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలమార్గం ప్రపంచానికి ఒక ముఖ్యమైన ఇంధన సరఫరా మార్గం. 20 నుండి 25 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, దాదాపు 10 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది.
ATF పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం అమలు
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. కొత్త నిబంధనల ప్రకారం, ATF పై లీటరుకు ₹50 పన్ను నిర్ణయించారు. మినహాయింపు తరువాత, ఎఫెక్టివ్ రేటు లీటరుకు 29.5కి తగ్గించారు. ఇది విమానయాన సంస్థల వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది.
దేశీయ చమురు కంపెనీలకు పెద్ద ఉపశమనం
ప్రభుత్వం పెట్రోల్ పై పన్నును పూర్తిగా తొలగించింది. అయితే డీజిల్ పై లీటరుకు ₹18.5 చొప్పున నిర్ణయించింది. ఎగుమతుల కోసం పెట్రోల్, డీజిల్ , ATF పై అనేక సుంకాల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనితో పాటు 2022లో అమలులోకి వచ్చిన విండ్ఫాల్ టాక్స్ కూడా రద్దు చేశారు. దీనివల్ల దేశీయ చమురు కంపెనీలకు ఉపశమనం లభిస్తుంది. ఈ మార్పులన్నీ అమలులోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం గురువారం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. భారత్ వద్ద సుమారు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు, 30 రోజులకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయని తెలిపింది. కొరత గురించి వస్తున్న నివేదికలను కొట్టిపారేసింది. ముడి చమురు, ఎల్పీజీ దిగుమతులను పెంచడానికి ప్రభుత్వం కొత్త ఒప్పందాలను వేగవంతం చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ వారం పార్లమెంటులో మాట్లాడుతూ, భారత్ లోని మూడు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలలో ప్రస్తుతం సుమారు 3.372 మిలియన్ టన్నుల చమురు ఉందని, ఇది వాటి గరిష్ట సామర్థ్యంలో మూడింట రెండు వంతులని తెలిపారు.
























