E85 and E100 Ethanol: పెట్రోల్ రేట్లకు చెక్ పెట్టేందుకు సర్కార్ భారీ ప్లాన్.. దేశంలోకి రాబోతున్న ఈ85 , ఈ100 ఇంధనాలు! దిగుమతుల తగ్గించడంపై ఫోకస్
పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ85 , ఈ100 ఇంధనాల వాడకంపై రోడ్డు రవాణా శాఖ కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది.

E85 and E100 Ethanol Blended Fuels in India: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. పెట్రోల్ ధరల సెగను తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమ శాతాన్ని మరింత పెంచేలా 'ఈ85' (E85) 'ఈ100' (E100) ఇంధనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 27, 2026న ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్కు అవసరమైన సవరణలు చేయాలని ఇందులో ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై ప్రజల నుండి అభిప్రాయాలను కోరుతున్నారు. ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఏమిటీ ఈ85 , ఈ100?
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం, ఈ85 ఇంధనం అంటే ఇందులో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇక ఈ100 విషయానికి వస్తే, ఇది దాదాపు పూర్తి స్థాయి ప్యూర్ ఇథనాల్ ఇంధనం. గత ఏడాది అంటే 2025లో భారత ప్రభుత్వం పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపే (E20) లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ20 ఇంధనం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు దానికి మించి ఇథనాల్ వాడకాన్ని పెంచడం ద్వారా విదేశాల నుండి దిగుమతి చేసుకునే క్రూడాయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంధన వర్గీకరణలో మార్పులు..
కేవలం కొత్త ఇంధనాలను ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఇంధన లేబులింగ్ విధానంలో కూడా మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటివరకు పెట్రోల్ ను ఈ10 లేదా ఈ అని పిలిచేవారు, ఇకపై దీన్ని ఈ10/ఈ20 గా అప్ డేట్ చేయనున్నారు. అలాగే కొత్తగా రాబోయే ఈ85, ఈ100 కేటగిరీలను అధికారికంగా గుర్తించనున్నారు. ఇదే తరహా మార్పులు డీజిల్ విభాగంలో కూడా రాబోతున్నాయి. బయో డీజిల్ బ్లెండింగ్ పరిమితిని బీ10 నుండి ఏకంగా బీ100 వరకు పెంచాలని సూచించారు. అంటే భవిష్యత్తులో మనకు పూర్తిగా జీవ ఇంధనం (Bio-based Diesel) తో నడిచే డీజిల్ వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
టెక్నికల్ అప్డేట్స్..
ఇంధనాలతో పాటు కొన్ని సాంకేతిక మార్పులను కూడా ఈ నోటిఫికేషన్ లో చేర్చారు. హైడ్రోజన్ ఫ్యూయల్ కు సంబంధించిన టెక్నాలజీ పేరును ఇకపై 'హైడ్రోజన్+సీఎన్' నుండి 'హైడ్రోజన్+సీఎన్జీ' (Hydrogen+CNG) గా మార్చనున్నారు. దీంతో పాటు ఉద్గారాల నిబంధనల (Emission Regulations) పరంగా కొన్ని కేటగిరీల్లో వాహనాల స్థూల బరువు పరిమితిని కూడా సవరించారు. గతంలో ఉన్న 3,000 కిలోల పరిమితిని ఇప్పుడు 3,500 కిలోలకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల వల్ల లాజిస్టిక్స్ ,రవాణా రంగంలో మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది.
మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వాహన తయారీ సంస్థలకు కొత్త సవాలుగా మారనుంది. ఎందుకంటే అధిక శాతం ఇథనాల్ తో నడిచేలా ఇంజిన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది లాంగ్ రన్ లో దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు కూడా ఇథనాల్ తయారీ ద్వారా అదనపు ఆదాయం లభించే ఛాన్స్ ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















