Cough syrup death case: అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
Madyapradesh: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో దగ్గుమందు తీసుకుని కొంత మంది చిన్నారులు చనిపోయారు. దీంతో కొన్ని రకాల దగ్గు మందును అధికారులు నిషేధించారు.

Cough syrup death cases in Madyapradsh : చిన్న పిల్లలకు ఇచ్చే దగ్గు మందులపై మరోసారి వివాదం ప్రారంభమయింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఏడుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారు. దీనికి కారణం దగ్గుమందేనన్న ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్లో కూడా ఇలాంటి మరణాలు నమోదుకావడంతో దీనికి కారణంగా భావిస్తున్న దగ్గుమందును అధికారులు నిషేధించారు. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) ఇప్పటికే ఆ దగ్గు మందు శాంపిల్స్ సేకరించి, దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, సిరప్లో డయెథిలీన్ గ్లైకాల్ (DEG) వంటి విషపదార్థాల కలుషితం కారణంగా ఈ మరణాలు జరిగాయని భావిస్తున్నారు. కేంద్ర డ్రగ్ కంట్రోలర్ జనరల్ (CDSCO) నేతృత్వంలో విస్తృత దర్యాప్తు జరుగుతోంది.
గత వారంలో మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7-12 ఏళ్ల పిల్లలు అసాధారణ జ్వరం, వాంతులు, కిడ్నీ సమస్యలతో హాస్పిటల్ల్స్లో చేరారు. వీరిలో ఆరుగురు చిన్నారులు చికిత్స పొందకముందే మరణించారు. రాజస్థాన్లో కూడా ఇద్దరు పిల్లలు ఇలాంటి లక్షణాలతో మరణించారు. డాక్టర్లు, జిల్లా అధికారులు పరిశోధనలో వీరంతా అంతకు ముందు దగ్గు మందు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ సిరప్లు ఓవర్-ది-కౌంటర్ ఔషధాలుగా లభ్యమవుతున్నాయి. "పిల్లలు జలుబు, దగ్గులకు ఈ సిరప్ను తీసుకున్న తర్వాత కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయి మరణాలు జరిగాయి" అని చింద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజ్ సింగ్ ప్రకటించారు.
ప్రాథమిక టెస్టుల్లో సిరప్లో DEG కలుషితం ఉందని తేలింది. ఈ విషపదార్థం 2023లో గాంబియాలో 70 మంది పిల్లల మరణాలకు కారణమైనదేనని గుర్తించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్లు ఈ సిరప్ను వెంటనే బ్యాన్ చేశారు. మరో 5 బ్రాండ్ల సిరప్లపై కూడా అనుమానం రావడంతో వాటినీ మార్కెట్ నుంచి ఉపసంహరించారు.
NCDC టీమ్ సెప్టెంబర్ 30న చింద్వాడా, జైపూర్లో పర్యటించి, హాస్పిటల్స్, ఔ షధ దుకాణాలు, నీటి మూలాల నుంచి సంపిల్స్ సేకరించింది. వాటిలో ఔషధ, నీరు, ఎంటమాలజికల్ శాంపిల్స్ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించి, CDSCOకి దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ స్టేట్ డ్రగ్ కంట్రోలర్లు కలిసి ఫ్యాక్టరీలపై రైడ్లు నిర్వహిస్తున్నారు.
2023లో ఉజ్బెకిస్తాన్, గాంబియాలో భారతీయ కంపెనీల దగ్గుమందుల వల్ల 200కి పైగా పిల్లలు మరణించారు. DEG కలుషితం కారణంగా కిడ్నీ డ్యామేజ్ జరిగింది. భారత్లో 2022లో గుజరాత్, తమిళనాడులో ఇలాంటి కేసులు వచ్చాయి. WHO హెచ్చరికలు జారీ చేసినా, ఔషధ ఫ్యాక్టరీల్లో నాణ్యతా పరీక్షలు బలహీనంగా ఉండటం ఈ సమస్యకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలు ఔషధ నియంత్రణలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.





















