AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
PV Narasimha Rao statue in AP: తెలంగాణ ప్రముఖులు పీవీ, చాకలి ఐలమ్మ, జయశంకర్ విగ్రహాలను ఏపీలో పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీలోనూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

AP Telangana statue politics: తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారి విగ్రహాలను ఏపీలో కూడా ప్రతిష్టించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. తెలంగాణ థింకర్స్ ఫోరమ్ తో పాటు పలువురు తెలంగాణ వాదులు ఈ డిమాండ్లను సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలపై ఏపీలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ సీనియర్ నేత యస్. విష్ణువర్ధన్ రెడ్డి శనివారం విశాఖపట్నంలో ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదని, వారు తెలుగు వారందరి ఉమ్మడి ఆస్తి అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు యస్. విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జన్మించినప్పటికీ.. పీవీ నరసింహారావు, చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు యావత్ తెలుగు సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. వారి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, దీనివల్ల తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం మరింత బలపడుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రాజేస్తోందని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, నాయకత్వాన్ని కించపరిచేలా చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని ఖండించారు.
గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి....
— Rani Rudhrama Reddy ( Modi ka parivar ) (@RaniRudrama) May 30, 2026
కళలకు , రాజకీయాలకు ప్రాంతీయ విబేధాలు లేనందున , ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి లో దేశ ప్రధాని అయిన ఏకైక తెలుగు బిడ్డ, ప్రఖ్యాత సాహితీ వేత్త, భారత రత్న శ్రీ…
రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా.. ఇంకా ప్రాంతీయ భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మహనీయుల గౌరవాన్ని రాజకీయ వివాదాలకు వాడుకోవడం సమాజానికి మంచిది కాదు అని హెచ్చరించారు. తెలంగాణ మహనీయులను ఆంధ్ర ప్రజలు ఎలాగైతే గౌరవిస్తారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహనీయులను తెలంగాణ ప్రజలు కూడా గౌరవిస్తారని, ఈ సంప్రదాయం కొనసాగాలని ఆయన కోరారు.
తెలంగాణలో పుట్టిన ప్రముఖుల విగ్రహాలు ఏపీలో ఏర్పాటు చేస్తే స్వాగతిస్తున్నాం.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 30, 2026
తెలంగాణలో పుట్టిన మేధావులు ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అనే ప్రాంతీయ నేతలు కాదు, వారందరూ తెలుగు ప్రముఖులు, కవులు, కళాకారులు. ఆ మేధావులు తెలుగు ప్రజల ఉమ్మడి ఆస్తి.
• విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఎటువంటి… pic.twitter.com/ko21eVOpYl
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ధర్మంతో ముందుకు సాగుతూ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిందని, పొరుగు రాష్ట్ర ప్రజలపై విషం చిమ్మడం ద్వారా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో మొదలైన విగ్రహాల ఏర్పాటు డిమాండ్ ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఈ కారణంగా బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకోవడం ద్వారా విభేదాలను తొలగించవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు






















