K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు
కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు. ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ (K Viswanath) ఇకలేరు. ఈ రోజు (గురువారం రాత్రి) ఆయన తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు (K Viswanath No More).
విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు.
తొలుత సౌండ్ రికార్డిస్ట్...
తర్వాత దర్శకుడిగా!
సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.
తొలి సినిమాకు నంది
'ఆత్మ గౌరవం' సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం', 'శారదా', 'ఓ సీత కథ', 'జీవన జ్యోతి' చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి.
'శంకరాభరణం'తో జాతీయ పురస్కారం
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో 'శంకరాభరణం' ఒకటి. దానికి ఉత్తమ సినిమాగా నంది మాత్రమే కాదు... జాతీయ అవార్డు కూడా వచ్చింది. 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్' విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది. 'సప్తపది', 'స్వాతిముత్యం', 'సూత్రధారులు', 'స్వరాభిషేకం' సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. 'స్వాతి ముత్యం' సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.
పద్మశ్రీ విశ్వనాథ్
చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయన్ను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ ఆయన దర్శకత్వం వహించారు. 'శుభ సంకల్పం' సినిమాతో నటుడిగా మారిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు. విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు.
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్గ్రౌండ్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















