Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్–ఎహ్సాన్–లాయ్
Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు.

Dhuniverse Grand Finale: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిభా అన్వేషణలో విజేతను ఎంపిక చేసే గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత త్రయం శంకర్–ఎహ్సాన్–లాయ్ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ ది నేషన్ విజేతను ప్రకటించనున్నారు.
60 వేల మంది నుంచి అభ్యర్థుల గుర్తింపు
గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ డిజిటల్ ఆడిషన్లకు దేశం నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు సుమారు 60,000 మందికి పైగా అభ్యర్థులు తమ ఆడియో, వీడియోలను సమర్పించారు. భౌగోళిక అడ్డంకులను తొలగిస్తూ కేవలం డిజిటల్ విధానం ద్వారానే ఇంత పెద్ద ఎత్తున ప్రతిభను గుర్తించడం ఈ వేదిక ప్రత్యేకత.
విజేతలకు లభించే ప్రోత్సాహకాలు
గ్రాండ్ ఫినాలేలో శంకర్–ఎహ్సాన్–లాయ్ ఎంపిక చేసిన 10 మంది ఫైనలిస్టులతో పాటు ఒక వైల్డ్కార్డ్ అభ్యర్థి తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. విజేతగా నిలిచిన వారికి ఈ కింది అవకాశాలు లభిస్తాయి
శంకర్–ఎహ్సాన్–లాయ్తో కలిసి బజాజ్ సంస్థ అధికారిక సంగీత గుర్తింపు (సోనిక్ ఐడెంటిటీ)ను రూపొందించే అవకాశం.
జీ మ్యూజిక్ కంపెనీతో కలిసి ఒక స్వతంత్ర ఆల్బమ్ రూపొందించడం.
ప్రముఖ ఆడియో ప్లాట్ఫామ్ స్పాటిఫై విడుదల కోసం సంగీత దర్శకులతో కలిసి పనిచేసే వీలు.
ప్రతిభకు పట్టాభిషేకం
ఈ సందర్భంగా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ అధ్యక్షుడు మనవ్ మియాన్వాల్ క్రీడలు, సంస్కృతి, సాంకేతికత వంటి రంగాల్లో ప్రతిభను ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, బజాజ్ ధూనివర్స్ ద్వారా లభించిన స్పందన తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ డిజిటల్ విధానం వల్ల అసాధారణ స్వరాలను వెలికితీయడం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఎహ్సాన్ నూరాని , లాయ్ మెండోన్సా లు కూడా అభ్యర్థుల ప్రతిభను కొనియాడుతూ ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
నవంబర్ 7, 2025న ప్రారంభమైన ఈ ప్రక్రియ, కఠినమైన బహుస్థాయి వడపోత ద్వారా ఫైనలిస్టుల ఎంపిక వరకు సాగింది. మార్చి 31న ముంబై వేదికగా జరిగే ఈ గ్రాండ్ ఫినాలే దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానుంది.























