Bihar Assembly Election Result 2025: బిహార్ కింగ్ ఎవరు? ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు పూర్తయ్యాయి!
Bihar Assembly Election Result 2025:బిహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ లెక్కింపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి (RO) ఒక కౌంటింగ్ పరిశీలకుడిని నియమించారు.

Bihar Assembly Election Result 2025: భారత ఎన్నికల కమిషన్ (ECI) 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించింది. ఈ సంవత్సరం, రాష్ట్రంలో 67.13 శాతం ఓటర్లు ఓటు వేశారు, ఇది 1951 తర్వాత అత్యధికం. నవంబర్ 14, 2025న జరిగే ఓట్ల లెక్కింపు కోసం కమిషన్ ఇప్పుడు అన్ని సన్నాహాలను పూర్తి చేసింది.
ఎన్నికల సంఘం ప్రకారం, ఈసారి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రీపోలింగ్ అవసరం రాలేదు. 2,616 మంది అభ్యర్థుల్లో ఎవరూ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థించలేదు. 12 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల్లో ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు దాఖలు చేయలేదు. ఇది ఇప్పటివరకు జరిగిన అత్యంత పారదర్శక ఎన్నికల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.
బిహార్ తుది ఓటర్ల జాబితాలో 74.5 మిలియన్లకుపైగా ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ, ఏ జిల్లాలో ఏ పార్టీ కూడా ఎటువంటి ఫిర్యాదులు లేదా అప్పీళ్లు దాఖలు చేయలేదు. మొత్తం 38 జిల్లాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా ప్రశాంతంగా న్యాయంగా జరిగిందని రుజువు చేస్తున్నాయి.
ఓట్ల లెక్కింపు కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు
బిహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి (RO), ఒక కౌంటింగ్ పరిశీలకుడిని నియమించారు. మొత్తం 4,372 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో-అబ్జర్వర్ సిబ్బంది ఉంటారు. పారదర్శకతను నిర్ధారించడానికి 18,000 మందికి పైగా అభ్యర్థుల ఏజెంట్లు కూడా లెక్కింపు ప్రక్రియలో ఉంటారు.
మూడు అంచెల భద్రతా వ్యవస్థను అమలు
ఎన్నికల కమిషన్ లెక్కింపు కేంద్రాల వద్ద అభేద్యమైన భద్రతను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా 24 గంటల CCTV నిఘాలో ఉంది. మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు: CAPF, CISF, CRPF మొదటి అంచెలో మోహించారు. బిహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (BSAP) రెండో అంచెకు బాధ్యత వహిస్తుంది; జిల్లా ఆర్మ్డ్ పోలీస్ (DAP) మూడో అంచెలో మోహరించారు. అదనంగా, ASP/DSP, మేజిస్ట్రేట్ స్థాయి అధికారులు లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా, పారదర్శకంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది, ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఉదయం 8:30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ EVM లెక్కింపు చివరి రౌండ్ ముందు పూర్తవుతుంది.
పారదర్శకత కోసం VVPAT సరిపోలిక ప్రక్రియ
EVM లెక్కింపు సమయంలో, సీల్స్ సురక్షితంగా ఉన్నాయని, సీరియల్ నంబర్లు రికార్డులతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోవడానికి ప్రతి కంట్రోల్ యూనిట్ను సంబంధిత ఏజెంట్లకు చూపిస్తారు. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓట్ల లెక్కింపులో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే, అక్కడి VVPAT స్లిప్లను తప్పనిసరిగా తిరిగి లెక్కించాలి. లెక్కింపు పూర్తయిన తర్వాత, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాలను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు, వాటి VVPAT స్లిప్లను EVM ఫలితాలతో సరిపోల్చుతారు.
ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్ (ECI) అధికారిక వెబ్సైట్లో రౌండ్ వారీగా, నియోజకవర్గాల వారీగా విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు, మీడియా ప్రతినిధులు https://results.eci.gov.in ని సందర్శించడం ద్వారా కచ్చితమైన, ధృవీకరించిన ఫలితాలను చూడొచ్చు. ప్రజలు ఎటువంటి అనధికారిక లేదా ధృవీకరించని వనరులపై ఆధారపడవద్దని, అధికారిక పోర్టల్ నుంచి మాత్రమే సమాచారాన్ని పొందాలని కమిషన్ కోరింది.





















