Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్లో 2 దశల్లో పోలింగ్
Assembly Election Dates 2026: : భారత ఎన్నికల కమిషన్ 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఆదివారం ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను ఈసీఐ ఇదివరకే పూర్తి చేసింది.

న్యూఢిల్లీ: భారత్లో మళ్లీ ఎన్నికల నగరా మోగింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి దేశ జనాభాలో దాదాపు 5వ వంతు భాగం. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల తేదీలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి పాల్గొన్నారు.
ఒకే ఫేజ్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు
అస్సాం, పుదుచ్చేరి, కేరళలో మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 26న ముగియనుంది. ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించి, మే 4న ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.
అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ఎన్నికల షెడ్యూల్
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 16
- నామినేషన్ల స్వీకరణ: మార్చి 16 నుంచి మార్చి 23 వరకు
- నామినేషన్ల పరిశీలన: మార్చి 24
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 26
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9
- ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 4
తమిళనాడులో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడులో మార్చి 30న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 30
- నామినేషన్ల స్వీకరణ: మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 9
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 23
- ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 4
పశ్చిమ బెంగాల్ లో రెండు దశలలో ఎన్నికలు
బెంగాల్ లో తొలి దశలో 152 నియోజకవర్గాల్లో, రెండో దశలో 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. బెంగాల్లో తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న నిర్వహించి ఈసీ ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన చేపట్టి విజేతల్ని ప్రకటించనుంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫేజ్ 1, 2
- ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 30
- నామినేషన్ల స్వీకరణ: మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 తేదీ వరకు
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 7వ తేదీ
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 9
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 23, 2026
- ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 4న
- సెకండ్ ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 2
- నామినేషన్ల స్వీకరణ: ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 10వ తేదీ
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 13
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 29, 2026
- ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 4న
ఎన్నికల షెడ్యూల్:
అస్సాం - పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9; ఓట్ల లెక్కింపు: మే 4
తమిళనాడు - పోలింగ్ తేదీ: ఏప్రిల్ 23; ఓట్ల లెక్కింపు: మే 4
పశ్చిమ బెంగాల్ - పోలింగ్ తేదీ: ఏప్రిల్ 23 (మొదటి దశ), ఏప్రిల్ 29 (రెండవ దశ); ఓట్ల లెక్కింపు: మే 4
కేరళ - పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9; ఓట్ల లెక్కింపు: మే 4
పుదుచ్చేరి - పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9; ఓట్ల లెక్కింపు: మే 4
8 స్థానాలకు ఉప ఎన్నికల తేదీలు..
గోవా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపురలో 8 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గోవా, కర్ణాటక, నాగాలాండ్ త్రిపురలో ఉప ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనుండగా.. గుజరాత్ మహారాష్ట్రలో ఉప ఎన్నికలు ఏప్రిల్ 23న నిర్వహించనున్నారు.
దాదాపు 17.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2.19 లక్షల పోలింగ్ బూత్లు, మొత్తం 25 లక్షల మంది అధికారులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. తొలిసారి ఓటు వేయనున్న యువత బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఈవో జ్ఞానేష్ కుమార్ కోరారు.
రాష్ట్రాల అసెంబ్లీ గడువు ఎప్పుడు పూర్తవుతుంది
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు 7 మే 2026న ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ మే 10, అస్సాం అసెంబ్లీ గడువు మే 20, కేరళ మే 23న, పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగియనుంది. ఫిబ్రవరిలో తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలతో పాటు, మార్చి 6- 7 తేదీల్లో కేరళ, మార్చి 9-10 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRపై ఈసీ సమీక్షించింది.
త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో దాదాపు 20 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీటి జనాభా కలిపి దేశ మొత్తం జనాభాలో సుమారు 17-18 శాతం ఉంది. ఈ రాష్ట్రాల నుంచి లోక్సభకు 116 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఇది మొత్తం 543 సీట్లలో సుమారు 21 శాతం. రాజ్యసభకు కూడా ఈ రాష్ట్రాల ఎమ్మెల్యేలు కలిసి 51 మంది సభ్యులను (సుమారు 21 శాతం) పంపిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీల ప్రభావం పార్లమెంటులో కూడా పెరిగిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు



















