West Bengal Election 2026: బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!
దీదీ ఓటు బ్యాంకులో చీలికకు బీజేపీ వ్యూహం. మైనారిటీ ఓటర్లమై పూర్తి ధీమాతో మమత. పదిహేనేళ్ల వ్యతిరేకతను మమత తప్పించుకోగలరా? మథువా సామాజిక వర్గం బీజేపీకి మొగ్గుతున్నారా? రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ రాజకీయం.

West Bengal Election 2026: ఎన్నికల నగారా మోగడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ సారి కేవలం రెండు దశల్లోనే (ఏప్రిల్ 23, 29) పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో, ప్రచార పర్వంలో వేగం పెరిగింది. అటు షెడ్యూలు విడుదలైందో లేదో బీజేపీ, టీఎంసీ పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలు వెంటనే ప్రకటించేసారు. అయితే ఈసారి కూడా పోటీ కేవలం టీఎంసీ, బీజేపీ మధ్యే ఉండనుంది.. అయితే మైనారిటీ ఓటు బ్యాంకును చీల్చే శక్తులు పోటీని రసవత్తరంగా మార్చనున్నాయి.
బీజేపీ వ్యూహం ఏంటి
ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనే నినాదంలో భాగంగా.. ఈసారి బెంగాల్పై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ అగ్రనాయకత్వం పకడ్బందీ ప్రణాళికతో ఉంది. గత ఎన్నికల్లో 77 స్ధానాలు మాత్రమే గెలుచుకున్నప్పటికీ 39 శాతం ఓట్లు సాధించి విజయం అసాధ్యమేమీ కాదన్న సందేశం చాటుకుంది.
ఈసారి పంచముఖ వ్యూహంతో ఆ పార్టీ పథక రచన చేస్తోంది. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ఒక్కో జోన్కు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా నియమించారు. సమర్ధులైన అభ్యర్ధుల ఎంపికతోపాటు, అక్కడి సమాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా అధిష్టానం వ్యూహాలను క్షేత్రస్ధాయిలో అమలు చేయడం వారి బాధ్యత. మోదీ చరిష్మా ఎలాగూ తమకు ప్రధానాస్త్రం కానుందని ఆ పార్టీ చెబుతోంది. ప్రధాని మోదీ స్వయంగా 20కిపైగా భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు అమిత్ షా - పార్టీ సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు సర్వేలు వ్యూహాలతో కసరత్తులు చేస్తూనే వున్నారు.
టీఎంసీ ప్రభుత్వంపై 15 ఏళ్ల వ్యతిరేకత, సందేశ్ఖాలీ, ఆర్.జి.కర్ వంటి సున్నితమైన అంశాలను హైలైట్ చేస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం బీజేపీకి ప్రధానాస్త్రాలు. అలాగే సీఏఏ (CAA) ద్వారా మథువా ఓట్లను కన్సాలిడేట్ చేయడం బీజేపీ ప్రధాన లక్ష్యం. దీనికి తోడు టీఎంసీ ఓటు బ్యాంకును చీల్చే వర్గాలను గుర్తించి వారితో పొత్తులు, లేదా విడిగా పోటీచేయించే ఎత్తులు కూడా బీజేపీ వేస్తోంది.
మతా బెనర్జీ ప్రతి వ్యూహం
జాతీయ వాద ఓటర్లను మూడగట్టడంలో బీజేపీ ముందుంటే ప్రాంతీయ వాదాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో మమత సిద్దహస్తురాలు. 'మా-మాతి-మానుష్' వ్యూహంతో విపక్షాల దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో వుంది.
బెంగాలీ అస్మిత:
బీజేపీని "బయటి పార్టీ"గా ముద్ర వేయడం, బెంగాలీ సంస్కృతిని కాపాడేది తానేనని ప్రజల్లోకి వెళ్లడం మమత ప్రధాన ప్రచారాస్త్రం.
పథకాలే శ్రీరామరక్ష: 'లక్ష్మీర్ భండార్' ద్వారా మహిళలకు అందుతున్న ఆర్థిక సాయం, మైనారిటీల కోసం పెంచిన గౌరవ వేతనాలు (ముజమ్, పురోహిత్ భత్యం) వంటివి ఆమెకు బలమైన ఓటు బ్యాంకును సృష్టించాయి.
సామాజిక వర్గాలకు బోర్డులు:
షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఓబీసీ వర్గాల కోసం కొత్తగా ఐదు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి సోషల్ ఇంజనీరింగ్కు తెరలేపారు.
మైనారిటీ ఓట్లు:
డిసైడింగ్ ఫ్యాక్టర్! బెంగాల్లో దాదాపు 30% వరకు ఉన్న ముస్లిం ఓటర్లు ఎప్పుడూ టీఎంసీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. సీఏఏ, ఎస్ఐఆర్ వంటి బీజేపీ విధానాలు ఈసారి కూడా మైనారిటీ ఓట్లు తమవైపే కన్సాలిడేట్ అవుతాయన్న నమ్మకంతో మమత ఉన్నారు.
ఈసారి మైనారిటీలు చీలుతారా..
33 శాతం మైనారిటీల్లో అత్యధికులు మమతకు ఓటు వేయటమే వరుస విజయాలకు కారణం. కానీ ఈసారి సీన్ మారుతోంది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) (నౌషాద్ సిద్దిఖీ)ఫుర్ఫురా షరీఫ్ మత పెద్దల మద్దతుతో యువతలో క్రేజ్ సంపాదించింది. దక్షిణ బెంగాల్లో టీఎంసీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. AIMIM (ఒవైసీ)గత ఎన్నికల్లో విఫలమైనా, ఈసారి మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో గట్టిగా పోటీ చేసి తన ఉనికిని చాటాలని చూస్తోంది. JUP (హుమాయున్ కబీర్)టీఎంసీ మాజీ నేత కబీర్ పెట్టిన 'ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ'(JUP) మైనారిటీ అసంతృప్త ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ పార్టీలన్నీ కలిసి లెఫ్ట్-కాంగ్రెస్ కూటమితో జతకడితే, మైనారిటీ ఓట్లు భారీగా చీలిపోయి అల్టిమేట్గా బీజేపీకి మేలు జరుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
మథువా సామాజిక వర్గానివి 20 శాతం ఓట్లు
విభజన సమయంలో, ఆ తర్వాత బంగ్లాదేశ్ శరణార్థులుగా బెంగాల్కు వలస వచ్చిన హిందూ దళితులు మథువా వర్గీయులు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 'మథువా' (Matua) ఓటు బ్యాంక్ అనేది ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల అత్యంత శక్తివంతమైన అంశం. బెంగాల్ జనాభాలో సుమారు 17% నుంచి 20% వరకు ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఉత్తర 24 పరగణాలు, నదియా సరిహద్దు జిల్లాల్లో వీరికి భారీ పట్టు ఉంది. బెంగాల్లోని సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో మథువా ఓటర్లు గెలుపోటములను శాసించగలరు. గతంలో వామపక్షాలకు, ఆ తర్వాత మమతా బెనర్జీకి అండగా నిలిచారు. 2019 లోక్సభ ఎన్నికల నుంచీ మొగ్గు బీజేపీకి మొగ్గుచూపుతున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంశం 'శాశ్వత పౌరసత్వం' కోరుకుంటున్నారు. CAA అమలును వేగవంతం చేయడం ద్వారా మథువాలకు పౌరసత్వం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
వామపక్షాలు తెరమరుగైనట్టేనా? కాంగ్రెస్ ఉనికి చాటుకుంటుందా?
గత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన లెఫ్ట్ పార్టీలు ఈసారి చావోరేవో తేల్చుకోవాలని చూస్తున్నాయి. ముహమ్మద్ సలీం నాయకత్వంలో యువ అభ్యర్థులకు పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన పట్టున్న ఉత్తర బెంగాల్ జిల్లాలపై దృష్టి సారించింది. వీరు మైనారిటీ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే టీఎంసీ గెలుపును పరోక్షంగా ఆపగలవు తప్ప స్యయంగా పూర్వ వైభవం దక్కించుకునే అవకాశం లేదు.
బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ భావోద్వేగాల మీద నడుస్తాయి. ఓ వైపు హిందూ ఓట్లను ఏకం చేయాలని బీజేపీ, మరోవైపు మైనారిటీలు, మహిళల మద్దతుతో కోటను కాపాడుకోవాలని టీఎంసీ చూస్తున్నాయి. కానీ ISF, JUP, AIMIM వంటి మైనారిటీ పార్టీలు, మథువాల వంటి సమాజిక వర్గాలు ఎన్ని ఓట్లు చీలుస్తాయనే దానిపైనే బెంగాల్ సింహాసనం ఎవరికి దక్కుతుందనేది ఆధారపడి ఉంటుంది.























