Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్ జిల్లాలో ఘటన
Bhainsa Road Accident: నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందడంతో విషాదం నెలకొంది.

Nirmal Road Accident | భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సత్పూల్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఒక కంటైనర్, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం వారి కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది.
మృతులను గుర్తించిన పోలీసులు
మృతులను కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాబన్న (70, రాజన్న (60), పటేల్ (42), కారు డ్రైవర్గా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న మిగిలిన ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సత్పూల్ బ్రిడ్జి వంటి మలుపులు ఉన్న ప్రాంతాల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట లేదా సుదీర్ఘ ప్రయాణాల తర్వాత అలసట వల్ల డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇలాంటి ఎదురెదురు (Head-on) ఢీకొనే ప్రమాదాలు జరుగుతుంటాయి. నిర్మల్ - భైంసా మార్గంలో భారీ వాహనాలు ఎక్కువగా వెళ్తుంటాయి. ఈ ప్రాంతంలో ప్రమాదాల హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు అవసరమని స్థానికులు కోరుతున్నారు.
























