Mumbai To Dubai Train: ముంబై నుంచి దుబాయ్ - కేవలం 2 గంటల జర్నీ, విమానం కన్నా వేగం!
Mumbai To Dubai Journey Time: ముంబై-దుబాయ్ మధ్య ప్రయాణం కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది, నీటిలో నడిచే అత్యంత వేగవంతమైన సూపర్ఫాస్ట్ రైలు రాబోతోంది.

Mumbai To Dubai Underwater Train Project News: మన దేశం నుంచి దుబాయ్ వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందరూ విమానంలోనే వెళ్లొస్తుంటారు. ముంబై - దుబాయ్ మధ్య చాలా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ముంబై నుంచి దుబాయ్ 1,198 మైళ్లు లేదా 1,928 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డిస్టాన్స్ కవర్ చేయడానికి అంతర్జాతీయ విమానాలకు దాదాపు 3 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. అంటే, ముంబైలో విమానం ఎక్కితే, 3.15 గంటల్లో దుబాయ్లో ల్యాండ్ అవుతాం. ఇకపై, ఈ టైమ్ గణనీయంగా తగ్గబోతోంది.
ముంబై - దుబాయ్ హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్
ముంబై - దుబాయ్ మధ్య నడిచే హై స్పీడ్ ట్రైన్ కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం అవుతోంది. అదెలా కుదురుతుంది?, రెండు నగరాల మధ్య భూ మార్గం లేదు కదా, మధ్యలో అరేబియా సముద్రం ఉంది కదా అన్న డౌట్ వచ్చిందా?. మీరు సరిగ్గానే ఆలోచించారు. భూ మార్గం లేకపోయినప్పటికీ రైలు ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు నీటి అడుగున, అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది. అండర్ వాటర్ హై స్పీడ్ ట్రైన్ అన్నమాట.
విమానం కన్నా వేగంగా...
ముంబైలో బయలు దేరి అరేబియా సముద్రంలో దిగి, నీటి అడుగున నడిచే ఈ హై స్పీడ్ రైలు మళ్లీ దుబాయ్లో రోడ్డు ఎక్కుతుంది. తద్వారా, ముంబై - దుబాయ్ మధ్య ప్రయాణ సమయాన్ని చాలా ఆదా చేస్తుంది. ఈ కొత్త రైలు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే అధిగమించవచ్చు & విమానం కన్నా వేగంగా వెళ్లవచ్చు.
గంటకు 1000 కిలోమీటర్ల వేగం!
UAE నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రణాళిక ప్రకారం, దుబాయ్ - ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు, ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది. ఈ హై స్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళితేనే, ముంబై - దుబాయ్ మధ్య ఉన్న దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుతుంది.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు, ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందడంలో పురోగతి లేక ఆ ప్రతిపాదన కోల్డ్ స్టోరేజీలోకి చేరింది. ఈ ప్రతిపాదిత రైలు నెట్వర్క్ విమాన ప్రయాణికులకు మరొక జర్నీ ఆప్షన్ను అందిస్తుంది, ఎయిర్ రష్ను తగ్గిస్తుంది. రద్దీ తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది, ఆటోమేటిక్గా టిక్కెట్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. మరోవైపు, ఇది భారతదేశం - UAE (United Arab Emirates) మధ్య ముడి చమురు & వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది.
అండర్ వాటర్ రైల్ నెట్వర్క్ ద్వారా ప్రయాణీకులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో బిలియన్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాజెక్టులోకి ప్రవహిస్తాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ముంబై - దుబాయ్ అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వివిధ ఆమోదాలు, ఆర్థిక పెట్టుబడులపై ఈ ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంటుంది.





















