హైవే మీద పశువుల సంచారం ఉంటే ముందే అలెర్ట్! వాహనదారులకు పెద్ద ఊరట
జాతీయ రహదారులపై పశువుల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు NHAI కొత్త అలెర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. వాహనదారులకు ముందుగానే SMS, వాయిస్ అలెర్ట్లు అందనున్నాయి.

National Highway Safety - Stray Cattle Alert: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తీసుకుంది. హైవే మీద అకస్మాత్తుగా పశువులు ఎదురుపడటం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో, రియల్టైమ్ సేఫ్టీ అలెర్ట్ సిస్టమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ చర్యను రోడ్ సేఫ్టీ మంత్ (జనవరి 1 నుంచి 31 వరకు) సందర్భంగా అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ను ప్రస్తుతం జైపూర్-ఆగ్రా & జైపూర్-రివారి జాతీయ రహదారి మార్గాల్లో అమలు చేస్తున్నారు. ఈ రెండు కారిడార్లు పశువుల సంచారం ఎక్కువగా ఉండే, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ ప్రయాణించే వాహనదారులకు పశువులు ఉండే ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల ముందే అలెర్ట్లు పంపిస్తున్నారు.
అలెర్ట్ ఈ విధంగా ఉంటుంది
ఈ అలెర్ట్లు ముందుగా ఫ్లాష్ SMS రూపంలో, వెంటనే వాయిస్ అలెర్ట్ రూపంలో వస్తాయి. హిందీలో పంపే ఈ సందేశం.... “పశువులు మేసే ప్రాంతం ముందు ఉంది. దయచేసి నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి” అనే అర్థంతో ఉంటుంది. ముఖ్యంగా పొగమంచు, తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో ఈ అలెర్ట్లు వాహనదారులకు ఎంతో ఉపయోగపడతాయని NHAI అధికారులు చెబుతున్నారు.
వాహనదారులకు అలెర్ట్లు ఎక్కువగా వచ్చి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకసారి అలెర్ట్ వచ్చిన తర్వాత 30 నిమిషాల లోపు మళ్లీ అదే అలెర్ట్ రాదు. ఇలా చేయడం వల్ల అలెర్ట్ చిరాకు సమస్యను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
క్యాటిల్ ప్రోన్ జోన్లుగా గుర్తింపు
ఈ సిస్టమ్ టెలికాం టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గతంలో జరిగిన ప్రమాదాల డేటా, ఫీల్డ్ స్థాయి సమాచారం ఆధారంగా పశువులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలను గుర్తించి, వాటిని క్యాటిల్ ప్రోన్ జోన్లుగా మార్క్ చేశారు. ఆ జోన్లకు వాహనం చేరుకునే సమయంలో ఆటోమేటిక్గా అలెర్ట్ ట్రిగ్గర్ అవుతుంది.
రహదారి భద్రతను మెరుగుపర్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్లను కఠినంగా అమలు చేయడం, ఆటోమేటెడ్ స్పీడ్ కెమెరాలు, వేరియబుల్ మెసేజ్ సైన్బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఇందులో భాగం.
ఇదే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో హైవేల వెంట పశువులు లోపలికి రాకుండా ఫెన్సింగ్, అలాగే అండర్పాస్ క్రాసింగ్లు నిర్మించాలని ఆదేశించారు. ఇవన్నీ కలిసి మానవులు-పశువుల మధ్య జరిగే ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర హైువేలకూ విస్తరించే అవకాశం
ప్రస్తుతం అమలులో ఉన్న ఈ పైలట్ ప్రాజెక్ట్ పనితీరును సమీక్షించిన తర్వాత, దేశవ్యాప్తంగా పశువుల ముప్పు ఎక్కువగా ఉన్న ఇతర జాతీయ రహదారి మార్గాలకు విస్తరించే అవకాశం ఉందని NHAI స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, హైవే ప్రయాణం మరింత సురక్షితంగా మారనుందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.





















