Dussehra 2023: దసరా వేడుకలను సరికొత్తగా చూడాలంటే ఈ 6 ప్రాంతాలకు వెళ్లాల్సిందే.!
Dussehra 2023: ఈ ఏడాది దసరా ఉత్సవాలు సరికొత్త అనుభూతి ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే, తప్పకుండా ఈ ప్రాంతాలకు వెళ్లండి. మీకు మరచిపోలేని ప్రత్యేక జ్ఞాపకాలు ఖాయం.

Dussehra 2023: దసరా వచ్చిందంటే చాలు.. దేశంలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహాలో కనీవినీ ఎరుగని విధంగా దసరా వేడుకలు జరుగుతాయి. నవరాత్రుల పేరుతో నిర్వహించే ప్రతి వేడుకకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది దసరాను వినూత్నంగా జరుపుకోవాలంటే తప్పకుండా ఈ ప్రాంతాలను సందర్శించండి.
అహ్మదాబాద్, వడోదర..గుజరాత్
గుజరాత్లో నవరాత్రి వేడుకలను కనులపండువగా నిర్వహిస్తారు. హాలెరి రాజుల ఆధిపత్య చరిత్రలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కార్నివాల్ పండుగను మరియమ్మ పండుగ అని కూడా అని కూడా అంటారు. ఇక్కడ దసరా రోజున గర్బా నృత్యం చేస్తారు. ముఖ్యంగా అహ్మదాబాద్, వడోదరలో జరిగే వేడుకల్లో ప్రదర్శించే గర్బా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డోలు బాజాలు వాయిస్తూ రంగు రంగుల దుస్తుల్లో కళాకారులు ప్రదర్శించే నృత్యాలు ఆకట్టుకుంటాయి. అమ్మవారికి నిర్వహించే ‘గుజరాతీ హారతి’ నృత్యం తప్పకుండా చూడాల్సిందే.
జగదల్పూర్, ఛత్తీస్గఢ్
దసరా అంటే తొమ్మిది రోజులే జరుకుంటారని భావిస్తే పొరపాటే. ఛత్తీస్గఢ్లోని ఆదివాసీలు 75 రోజుల పాటు దసరా వేడుకలు నిర్వహిస్తారు. బస్తర్ (జగదల్పూర్) దసరాను ప్రకృతి ఆరాధనగా భావిస్తారు. ఇది ప్రధానంగా దంతేశ్వరి దేవి (ఛత్తీస్గఢ్లోని బస్తర్ గిరిజనుల దేవత), ఇతర దేవతల గౌరవార్థం నిర్వహిస్తారు. 15వ శతాబ్దంలో కాకతీయ రాజు పురుషోత్తం దేవ్ ఒడిశాలోని పూరీకి తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చిన తర్వాత ఈ పండుగ ప్రారంభమైందని స్థానిక చరిత్ర చెబుతోంది. వేడుకల్లో భాగంగా చెట్లను ఆరాధిస్తారు. ఇంకా ఎన్నో రకాలుగా దేవీకి పూజలు చేస్తూ ఆదివాసీ సాంప్రదాయాల్లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలు చాలా భిన్నంగా ఉంటాయి. బస్తర్ దసరా సరికొత్త అనుభవం కలిగిస్తుంది. ఈ 75 రోజుల్లో పాత జాతర, కచనగాడి, నిషా జాతర వంటి అనేక ఆచారాలను నిర్వహిస్తుంటారు. రథం ఊరేగింపులు, బస్తర్లోని వివిధ దేవతల జగదల్పూర్ సందర్శన, గిరిజన పెద్దల సమావేశం, కృతజ్ఞతా వేడుకలు నిర్వహిస్తారు.
కోల్కతా దుర్గాపూజ
పశ్చిమ బంగలో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకొనే వేడుక దసరా. బెంగాల్ ప్రజలు ఈ పండుగను దుర్గా పూజ లేదా పుజొ పేరుతో జరుపుకుంటారు. దసరా సందర్భంగా కోల్కతా నగరమంతా పెద్ద పెద్ద పెండాళ్లు (మండపాలు) ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క మండపానికి ఒక్కో ప్రత్యేక థీమ్ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో లక్షలు వెచ్చించి మరీ మండపాలను తీర్చిదిద్దుతారు. అంతేకాదు, ‘బొనెది బరీ’ పేరుతో కోల్కతాలో ఉండే రాజభవనాల్లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటుచేసే అమ్మవారి విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది.
కోట.. రాజస్థాన్
రాజస్థాన్లోని కోట నగరంలో దసరా వేడుకలు అత్యంత ప్రసిద్ధి పొందాయి. కోటలో, ప్రతి సంవత్సరం 25 రోజుల పాటు దసరా జరుపుకొంటారు. ఈ ప్రధాన సాంస్కృతిక కార్యక్రమానికి ప్రతి రోజూ భారీగా సందర్శకులు తరలివస్తారు. నగరంలోని దసరా 'మేళా' మైదానంలో మొత్తం జాతర సందర్భంగా లక్షలాది మంది సందర్శకులు వస్తారు. ఇక్కడ ప్రముఖ హస్తకళాకారులు.. సాంస్కృతిక కళాకారులు పాల్గొని జాతర మాదిరిగా జరుపుకొంటారు. పండుగ ముగింపు సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావణ విగ్రహాలను దహనం చేస్తారు. చంబల్ నది ఒడ్డున ఘనంగా జాతర జరుగుతుంది.
మైసూర్
దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. మైసూరులో చేసే దసరా వేడుకలకు దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడి దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకూ ప్రతీకగా నిలుస్తాయి. నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపం వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది.
Also Read : దసరా వేడుకల్లో గార్బా, దాండియా డ్యాన్సుల ప్రత్యేకతలు తెలుసా? రెండిటికీ తేడా ఇదే!
కులు
హిమాచల్ప్రదేశ్లోని కులు.. ప్రకృతి అందాల్లోకే కాదు, దసరా వేడుకలకూ ప్రత్యేకమే. ఈ అక్టోబర్లో కులు మనాలి పర్యటనకు వెళ్లేవారు తప్పకుండా దసరా వేడుకలకు హాజరయ్యేలా చేసుకోండి. దసరా సందర్భంగా కులులోని ధలపూర్ మైదానంలో రఘునాథ రథయాత్ర నిర్వహిస్తారు. కులు సమీపంలోని వివిధ గ్రామాల నుంచి 200 పైగా విగ్రహాలను ఈ సందర్భంగా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1637లో రాజా జగత్ సింగ్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో దసరా వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి నుంచి కులు దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ రావణ విగ్రహానికి బదులు ఆకులు, గడ్డి కాల్చుతూ ‘లంకా దహనం’ నిర్వహిస్తారు.
Also Read : విజయదశమి ప్రాశస్త్యం, ఎలా జరుపుకోవాలో తెలుసా!
Before You Go
Jupiter to Reach Opposition : 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా రానున్న జ్యూపిటర్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















