Riyaz Encounter Nizamabad: రియాజ్ ఎన్కౌంటర్పై స్పందించిన డీజీపీ- అందుకే కాల్పులు జరిపినట్టు ప్రకటన
Riyaz Encounter Nizamabad: ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రియాజ్పై కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ తెలిపారు. నిజామాబాద్లో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు.

Riyaz Encounter Nizamabad: నిజామాబాద్లో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్పై రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. ఇప్పటికే కానిస్టేబుల్ను హత్య చేసి మరికొందరిని గాయపరిచిన వ్యక్తి చేతికి గన్ వచ్చి ఉంటే ఆసుపత్రిలో బీభత్స జరిగేది అన్నారు. అందుకే అన్నింటి గురించి ఆలోచించిన తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలపై ప్రతిపక్షంగా ఘాటుగా విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందని పోలీసులకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపిస్తోంది.
రియాజ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసుల భద్రతపై కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ను హత్య జరిగిన తర్వాత ఈ కేసు ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు హంతకుడి ఎన్కౌంటర్ దేశవ్యాప్తం సంచలనంగా మారింది. అరెస్టు అయ్యి 24 గంటల కాక ముందే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎన్కౌంటర్లో హతమవ్వడం పెను ప్రకంపనలు సృష్టించింది. అందుకే దీనిపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలుక కాపాడేందుకే ఎన్కౌంటర్ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే కానిస్టేబుల్ను హత్య చేసి, మరికొందర్ని తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి చేతిలో గన్ పడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోలీసులు ఆసుపత్రిలో గన్ ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
శుక్రవారం నుంచి సోమవారం వరకు అనేక మలుపులు
శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రియాజ్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బైక్ చోరీలు, ఇతర నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్న రియాజ్ కోసం చాలా కాలంగా పోలీసులు వెతుకుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇతని గురించి పోలీసులకు ఓ లీడ్ దొరికింది. అతను ఉన్న ప్రాంతం గురించి తెలిసిన వెంటనే కానిస్టేబుల్ ప్రమోద్ తాను ఆసుపత్రికి వెళ్లడం మానేసి తన మేనల్లుడిని బైక్పై ఎక్కించుకొని రియాజ్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. ఇంతలో స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. వాళ్లు కూడా వచ్చారు. ఇంతలో కానిస్టేబుల్ ప్రమోద్ను పట్టుకొని తన పైక్పై కూర్చొబెట్టుకొని స్టేషన్కు తీసుకెళ్లడం ప్రారంభించాడు. ప్రమోద్ బైక్ డ్రైవ్ చేస్తుంటే రియాజ్ మధ్యలో కూర్చొని ఉన్నాడు. వెనుకాల ప్రమోద్ మేనల్లుడు ఉన్నాడు.
బైక్ స్టేషన్కు వెళ్తున్న టైంలో రియాజ్ ఎదురు తిరిగాడు. అప్పటి వరకు సైలెంట్గా కూర్చొని ఉన్న రియాజ్ తన వద్ద ఉన్న కత్తిని ప్రమోద్ గుండెల్లో దించాడు. అంతే బైక్ పక్కతో కిందపడిపోయాడు. రియాజ్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రమోద్ మేనల్లుడు కూడా ప్రయత్నించాడు. వెనకాలే వస్తున్న ఎస్సై కూడా ట్రై చేశాడు. కానీ వారిద్దర్ని గాయపరిచి పారిపోయాడు రియాజ్.
కానిస్టేబుల్ను హత్య చేసి ఎస్సైతోపాటు పౌరుడిని గాయపరిచి పారిపోయిన రియాజ్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులకే రక్షణ కరవైందని ప్రతిపక్షాలు విమర్శు చేయడం మొదలు పెట్టాయి. నేరస్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించాయి. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల తర్వాత ఆదివారం వాళ్లకు లీడ్ దొరికింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే వెళ్లి పట్టుకునేందుకు యత్నించారు. కానీ అక్కడ కూడా పోలీసులపై ఎదురు తిరిగేందుకు రియాజ్ ట్రై చేశాడు. అతన్ని పట్టుకునే క్రమంలో ఓ యువకుడు కూడా గాయపడ్డాడు.
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడిన రియాజ్ను, అతన్ని పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన మరో యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రియాజ్ దుర్మార్గం గురించి తెలిసిన పోలీసులు అతని కాళ్లు చేతులు కట్టేసి మరీ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఉదయం ఎక్స్రే కోసం తరలిస్తుండగానే ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్ లాక్కున్నాడు రియాజ్. ఆ గన్తో బెదిరించడం మొదలు పెట్టాడు. ప్రజలపైకి కూడా కాల్పులు జరిపేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు.





















